నేటి నుంచి నగరంలో కేటీఆర్ రోడ్‌షో.. 2016 ఎన్నికల రూట్‌లోనే వెళ్తోన్న కేటీఆర్

Arun Chilukuri
Updated on: 21 Nov 2020 9:00 AM IST
నేటి నుంచి నగరంలో కేటీఆర్ రోడ్‌షో.. 2016 ఎన్నికల రూట్‌లోనే వెళ్తోన్న కేటీఆర్
X

టీఆర్ఎస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టి నుంచి జోరందుకోనుంది. గత బల్దియా ఎన్నికల్లో అన్నీ తానై నడిపించిన ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మార్క్ చూపేందుకు సన్నద్దమయ్యారు. ఇవాళ్టి నుంచి రోడ్‌షోలతో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచార రంగంలోకి దిగుతున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. ఇవాళ్టి నుంచి ఆయన ప్రచార జోరు ప్రారంభం కాబోతోంది. నగరవ్యాప్తంగా రోడ్‌షోలతో ప్రచారం చేసేందుకు సిద్ధమైన కేటీఆర్‌ తొలి రోడ్‌షో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటల వరకు ప్రచార కార్యక్రమం ఉండనుంది. ముందుగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు రేపు మహేశ్వరం, ఎల్‌బీ నగర్ నియోజవకర్గాల్లో ప్రచారం చేయనున్నారు కేటీఆర్‌.

2016 ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలుపులో కేటీఆర్ ప్రచారాలదే కీలక పాత్ర. సుడిగాలి పర్యటనలు చేసి పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టారు. దీంతో మళ్లీ అదే తారక మంత్రంతో ఎన్నికలకు వెళ్తోంది టీఆర్ఎస్. తక్కువ సమయంలో నగరంలోని అన్ని నియోజకవర్గాలు చుట్టివచ్చేలా ప్లాన్ చేసింది. ఇక సెంటిమెంట్ పరంగానూ కలిసొస్తుందనే భావనతో నగరానికి ఈశాన్య దిశ నుంచి రోడ్ షో ప్రారంభిస్తున్నారు కేటీఆర్‌.

గత ఎన్నికల ప్రచారం మాదిరిగానే ఈ సారి కూడా రోడ్‌ షోలకు రూట్ మ్యాప్‌ను సిద్దం చేసింది టీఆర్ఎస్‌. గతంలోనూ ఇదే రూట్ మ్యాప్‌తో ప్రచారం చేసిన కేటీఆర్‌ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ ఎన్నికల ఇంఛార్జ్‌గా బాధ్యతలు భుజాన వేసుకున్న ఆయన జీహెచ్‌‌ఎంసీలో 99 సీట్లు సాధించేలా కృషి చేశారు. ఈసారి కూడా అదే జోష్‌లో ముందుకెళ్తోన్న టీఆర్ఎస్‌కు కేటీఆర్‌ ప్రచారం ఎంతమేరకు కలిసివస్తుందనేది చూడాలి మరి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story