Kadiyam Srihari: ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఇక్కడ కేటీఆర్ కు సంతోషం ఎందుకు?
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అందుకే ఓడింది: కడియం శ్రీహరి
Kadiyam Srihari comments on KTR: బీఆర్ఎస్ పార్టీతో స్నేహం చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణమైందని స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఢిల్లీలో బీజేపి గెలిస్తే... ఇక్కడ కేటీఆర్ సంతోషపడుతున్నారన్నారు. ఒకవేళ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి ఉండుంటే గెలిచి ఉండే వారని కడియం ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో గత పదేళ్లలో కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని కడియం శ్రీహరి అన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన బీఆర్ఎస్ పార్టీకి అసలు ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకునే సంస్కృతిని ప్రోత్సహించిన వారే ఇవాళ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ అంశం గురించి తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. అయితే, కోర్టు తీర్పు ఏదైనా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే పోటీకి వెనుకాడనని తేల్చిచెప్పారు.




