మరో అద్భుతానికి వేదికైన హైదరాబాద్‌ మెట్రో

* మెట్రో రైల్‌లో తొలిసారి గుండె తరలింపు * నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్ వ‌ర‌కు గ్రీన్ ఛానెల్‌ * నాగోల్‌ నుంచి ఎక్కడా ఆగకుండా ప్రయాణం

Sandeep Eggoju
Updated on: 3 Feb 2021 11:38 AM IST
Hyderabad Metro is the venue for another miracle
X

ఒక ప్రాణం నిలబెట్టేందుకు ఎన్నో మనసులు పరితపించాయి. ఓ గుండెను తరలించేందుకు వారి గుండెలు పరుగులు పెట్టాయి. మనసులు కదిలించిన ఈ గుండె తరలింపులో నిమిషాల వ్యవధిలో ఓ వ్యక్తికి హైదరాబాద్ మెట్రో రైల్ మరో రికార్డ్ సృష్టించింది. తొలిసారి గుండెను తరలించడానికి వేదికైంది. సక్సెస్‌ ఫుల్‌గా సాగిన ఈ హార్ట్ జర్నీ నగర వాసుల గుండెలను కదిలించింది. హైదరాబాద్ మెట్రో అందరి గుండెల్లో నిలిచేలా చేసింది.

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ మరో అద్భుతానికి వేదికైంది. మెట్రో రైల్‌లో తొలిసారి గుండె తరలించి రికార్డు సృష్టించింది. ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌‌కు గుండెను తరలించారు. ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌ పోస్ట్ వరకు మధ్యలో ఎక్కడా రైలు ఆగకుండా మెట్రో అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. పోలీసులు, మెట్రో సిబ్బంది, డాక్టర్ల సహకారంతో కొద్ది నిమిషాల్లోనే గుండె ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు చేరుకుంది.

4 గంటల 35 నిమిషాలకు కామినేని హాస్పిటల్ నుంచి గుండెతో బయలుదేరిన వైద్యులు 5 గంటల 10 నిమిషాలకు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి ఐదు నిమిషాల్లో ప్రత్యేక అంబులెన్స్‌లో గుండెను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో ఆస్పత్రి వరకు కూడా ట్రాఫిక్‌ను ముందుగానే క్లియర్‌ చేశారు పోలీసులు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన వరకాంతం నర్సిరెడ్డి రెండు రోజుల క్రితం హై బీపీతో ఎల్పీనగర్ కామినేని ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు జరుపుతుండగానే సోమవారం రోజున బ్రెయిన్ డెడ్ అయ్యాడని ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అవయవదానం గురించి వైద్యులు చెప్పడంతో అంగీకరించారు కుటుంబసభ్యులు. దాంతో నర్సిరెడ్డి శరీరంలో 8 భాగాలు సేకరించి గుండెను అపోలో హాస్పిటల్‌కు తరలించారు.

అయితే, రైతు గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మ‌రో వ్యక్తికి అమర్చాల్సి ఉంది. దాంతో, హెవీ ట్రాఫిక్ ఉండే ఈ మార్గంలో గుండెను తరలించేందుకు వైద్యులు మెట్రో రైల్‌ను ఎంచుకున్నారు. మెట్రో రైల్వే అధికారులకు ఆస్పత్రి వర్గాలు సమాచారం ఇవ్వగానే రైల్వే అధికారులు ముందుకు వచ్చారు. నాగోల్‌ మెట్రో స్టేష‌న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ర‌కు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు.

నిమిషాల వ్యవధిలోనే కామినేని నుంచి అపోలో హాస్పిటల్‌కు గుండెను తరలించగా ఆ గుండెను పేషంట్‌కు అమర్చేందుకు అపోలో వైద్యుడు డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. దీంతో గొప్పదైన అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన నర్సిరెడ్డి కుటుంబసభ్యులను అభినందిస్తున్నారు ప్రజలు. వైద్యులు, మెట్రో అధికారులు, పోలీసులు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని ప్రార్థిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story