టీఆర్ఎస్‌ అభ్యర్థిలో గుర్తుల గుబులు..కారును టెన్షన్‌ పెడుతున్న..

టీఆర్ఎస్‌ అభ్యర్థిలో గుర్తుల గుబులు..కారును టెన్షన్‌ పెడుతున్న..
x
Highlights

హుజూర్‌ నగర్‌లో టీఆర్ఎస్‌కు ప్రధాన పోటీ ఏయే పార్టీల నుంచి. ఎవరైన టక్కున చెప్పేయగలరు కాంగ్రెస్‌, బీజేపీల నుంచి అని. కానీ టీఆర్ఎస్‌ గుండెల్లో గుబులు...

హుజూర్‌ నగర్‌లో టీఆర్ఎస్‌కు ప్రధాన పోటీ ఏయే పార్టీల నుంచి. ఎవరైన టక్కున చెప్పేయగలరు కాంగ్రెస్‌, బీజేపీల నుంచి అని. కానీ టీఆర్ఎస్‌ గుండెల్లో గుబులు రేపుతున్నది ఎవరో తెలుసా. ఇద్దరు స్వతంత్రులు. అవును. ఇద్దరు ఇండిపెండెట్లు అధికార పార్టీ అభ్యర్థికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారట.

ఒకవైపు ఆర్టీసీ సమ్మె, ఇంకోవైపు కేసీఆర్‌ సభ వర్షార్పణం కావడంతో, తెగ టెన్షన్‌ పెట్టుకున్న టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, మరో ఇద్దరు వ్యక్తులు కూడా టెన్షన్‌ పెడుతున్నారట. హుజూర్‌ నగర్‌ బైపోల్స్‌లో వారిద్దరూ అసలు పోటీ కాకపోయినా, వారి గుర్తులు మాత్రం గుబులు రేపుతున్నాయట గులాబీ పార్టీ అభ్యర్థికి.

రోడ్ రోలర్ - ట్రాక్టర్ డ్రైవింగ్ చేసే రైతు''. ఈ రెండు చిహ్నాలు దాదాపు టీఆర్ఎస్ గుర్తు కారును పోలి ఉంటాయి. ఈ రెండు గుర్తులే ఇప్పుడు టీఆర్ఎస్‌ను టెన్షన్‌ పెడుతున్నాయి. హుజూర్‌ నగర్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయించింది ఎన్నికల సంఘం. అదీ కూడా జాబితాలో టీఆర్ఎస్‌ కారు గుర్తు తర్వాత అవే ఉండటం, అధికార పక్ష అభ్యర్థిలో మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

నిరక్షరాస్యులు - వృద్ధులు పొరపడి గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో, తమకు ఓటు వేయబోయి, ట్రక్కు గుర్తుకు వేశారని, దీంతో చాలా చోట్ల తాము నష్టపోయామంటున్నారు టీఆర్ఎస్‌ నేతలు. పదివేల ఓట్ల వరకు ఓట్లు, ట్రక్కు గుర్తుకే పడ్డాయని, ఈ కొద్ది గ్యాప్‌తోనే అనేక చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలున్నాయని అంటున్నారు. ఇప్పుడు హుజూర్ ‌నగర్‌లోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థికి అలాంటి దిగులే పట్టుకుందట.

హుజూర్ ‌నగర్‌ బైపోల్ బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులున్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి, నాలుగో నెంబర్‌ అలాట్ చేశారు. ఆయన తరువాత ఐదో నంబర్‌లో రైతుబిడ్డ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అజ్మీర మహేశ్‌ అనే స్వతంత్ర అభ్యర్థికి 'ట్రాక్టర్‌ నడిపే రైతు' సింబల్‌ను, ఆరో నంబరులో రిపబ్లిక్‌ సేన తరఫున బరిలో నిలిచిన వంగపల్లి కిరణ్‌కు రోడ్డురోలర్‌ గుర్తును కేటాయించింది ఎలక్షన్‌ కమిషన్. ఈ రెండు గుర్తులూ కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో, తమకు పడాల్సిన ఓట్లు ఇతరులకు పడతాయేమోనని టెన్షన్‌ పడుతున్నారు గులాబీ కార్యకర్తలు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కారును పోలిన ఆటోరిక్షా - లారీ చిహ్నాలు ఎవరికీ ఇవ్వవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరింది. అయితే ఇప్పుడు ఆ గుర్తులను అయితే ఈసీ కేటాయించలేదు. కానీ తాజాగా హుజూర్ నగర్ లో కారును పోలిన రోడ్ రోలర్ - ట్రాక్టర్ గుర్తులు మాత్రం ఇద్దరు స్వతంత్రులు దక్కించుకున్నారు. దీంతో అధికారపక్షాన్ని గుర్తుల భయం వెంటాడుతోంది.

గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా జనంలో అవేర్‌నెస్‌ తెచ్చేందుకు, వాడవాడలా గుర్తులపై అవగాహన కల్పిస్తున్నారు టీఆర్ఎస్‌ నేతలు. కారుకు రోడ్ రోలర్ - ట్రాక్టర్ గుర్తులకు తేడాలను చూపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, హుజూర్ నగర్ లో ఇంటింటికి వెళ్ళి ఓటర్లకు వివరిస్తున్నారు. ఒక్క ఓటు కూడా ఈ ఉప ఎన్నికల్లో ఎంతో కీలకం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్ నగర్ లో ఇప్పుడు ఈ రోడ్ రోలర్ - ట్రాక్టర్ గుర్తులు టీఆర్ఎస్ ను పెద్ద దెబ్బతీసేలా ఉన్నాయన్న అనుమానాలు గులాబీ శ్రేణులను పట్టి పీడిస్తున్నాయి.

ఇక గతంలోనూ తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. సైకిల్ ను పోలిన బైక్ గుర్తు, ఆ పార్టీని దెబ్బతీసింది. చాలా కష్టపడి ఈసీతో ఫైట్ చేసి బైక్ గుర్తును ఎన్నికల్లో నిషేధించింది టీడీపీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తన కారు గుర్తు పోలిన గుర్తులపై పోరాటం మొదలెట్టింది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. పాలేరు, నకిరేకల్, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఓటమి చవిచూసింది. మళ్లీ ట్రాక్టర్, రోడ్‌ రోలర్‌ గుర్తుల రూపంలో, బిక్కుబిక్కుమంటున్నాడు టీఆర్ఎస్‌ అభ్యర్థి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories