బండి సంజయ్ ఇంటి దగ్గర కొనసాగుతున్న హైటెన్షన్

Bandi Sanjay: ఇంకా గృహనిర్బంధంలోనే బండి సంజయ్

Jyothi
Published on: 24 Aug 2022 8:32 AM IST
High Tension Continues Near Bandi Sanjay House
X

బండి సంజయ్ ఇంటి దగ్గర కొనసాగుతున్న హైటెన్షన్

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటి దగ్గర హైటెన్షన్ కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనదీక్షల నేపథ్యంలో ఇంటి వద్దే బండి సంజయ్ దీక్షకు దిగనున్నారు. ఇక ప్రజాసంగ్రామ యాత్ర అనుమతి కోసం కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నుంచి అనుమతి వస్తే.. నేరుగా జనగామ వెళ్లనున్నారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఇంటికి బీజేపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

ప్రజా సంగ్రామ యాత్ర చేస్తూ జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం పాములూరు వద్ద ధర్మదీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ చర్యను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలు తీవ్రంగా ఖండించారు. రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ నేతృత్వంలో భాజపా ప్రతినిధి బృందం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసి వినతిపత్రం సమర్పించింది. సమగ్ర విచారణ జరిపించాలని కోరింది. కాగా యాత్రను ఆపేదే లేదని బండి సంజయ్‌ కరీంనగర్‌లో స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత ఇంటివద్ద నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించడం అక్రమమన్నారు.

రాష్ట్రంలో అక్రమ అరెస్ట్‌లు, దాడులు, నిర్బంధాలను నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష చేపట్టాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర, జిల్లా, మండల కేంద్రాల్లో దీక్ష చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గృహ నిర్బంధంలో ఉన్న తాను కూడా కరీంనగర్‌లో నివాసంలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు.

Jyothi

Jyothi

Next Story