గ్రేటర్ ఎన్నికలకు కరోనా కట్టడి నిబంధనలు పాటింపు

గ్రేటర్ ఎన్నికలకు కరోనా కట్టడి నిబంధనలు పాటింపు
x
Highlights

మరో రెండు మూడు నెలల్లో జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో కరోనా కట్టడి చర్యలపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారి చేసింది. ముఖ్యంగా...

మరో రెండు మూడు నెలల్లో జరగనున్న గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో కరోనా కట్టడి చర్యలపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారి చేసింది. ముఖ్యంగా ప్రచారంపై పరిమితులు విధించనున్నారు. పోలింగ్ అధికారులతో పాటు ఓటర్లు కూడా మాస్కులు ధరించడం తప్పని సరి చేశారు. ఓటరును గుర్తించాల్సిన పరిస్థితి వస్తే మాస్కును జరిపి ముఖాన్ని చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే సంబంధిత అధికారులు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి మార్గదర్శకాలపై తెలంగాణ రాష్ర్ట ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది.

ఇంటింటి ప్రచారంలో అభ్యర్ధి సహా ఐదుగురు వ్యక్తులు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. రోడ్ షోలకు ఐదు వాహనాలు మాత్రమే అనుమతించనున్నారు. సభలు, సమావేశాల నిర్వాహణలోనూ కరోనా కట్టడి చర్యలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను మరికొన్ని వర్గాలకు విస్తరించారు. రక్షణ రంగంలో పనిచేసే వారు, ఎన్నికల విధులకు హాజరయ్యే వారు, అధికారిక విధుల నిర్వహణలో భాగంగా దూరంగా ఉన్న.. విదేశాల్లో ఉన్న వారికి మాత్రమే ఇప్పటి వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వీలుంటుందని తెలిపారు. దివ్యాంగులకు, 80 ఏళ్లు పైబడిన ఓటర్లతో పాటు అత్యవసర సేవల విధుల్లో పాల్గొంటున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే వారి సంఖ్య భారీగా పెరగనుంది.

భౌతిక దూరం పాటించేలా విశాలంగా ఉన్న భవనాలను పోలింగ్ కేంద్రాలుగా గుర్తించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ కేంద్రం, ఆ పరిసరాల్లో శానిటైజర్ ను అందుబాటులో ఉంచాలని వెల్లడించారు. పోలింగ్ కు ఒక రోజు ముందే పోలింగ్ కేంద్రాలు శానిటైజ్ చేయాలని, పురుషులు, మహిళా ఓటర్లకు వేర్వేరు క్యూ లైన్లు ఉండెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం మూడో ప్రత్యేక లైన్ ఏర్పాటుతో పాటుపోలింగ్ కేంద్రాల దగ్గర మార్కింగ్ చేయాలని సూచించారు.

అభ్యర్ధులు నామినేషన్ ను టీఎస్ఈసీ వెబ్ సైట్ లో పూర్తి చేసి ఆ ప్రింట్ కాపీని రిటర్నింగ్ అధికారికి సమర్పించ వచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. అఫిడవిట్, విద్యార్హతలు, నేరచరిత్ర ఇతర వివరాలను ఆన్ లైన్ లో పూర్తి చేస ప్రింట్ కాపీ అందించ వచ్చని తెలిపింది. ఇక రోజు వారి ఎన్నికల వ్యయాన్ని కూడా ఆన్ లైన్ లోనే సమర్పించుకునే వెసులుబాటు కల్పించారు. నామినేషన్ దాఖలుకు అభ్యర్ధి, మరో ఇద్దరు మొత్తం ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే కార్యాలయ ఆవరణ దగ్గరకు రెండు వాహనాలనే అనుమతిస్తారు. కరోనా కట్టడి చర్యలు, ఏర్పాట్ల పర్యవేక్షణకు జీహెచ్ఎంసీ, సర్కిల్, వార్డు స్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని ఎన్నికల సంఘం అధికారులు ఆదేశించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories