Tamilisai SoundaraRajan conference With Private Hospitals: కరోనా బాధితులకు భరోసా కల్పించాలి : గవర్నర్ తమిళిసై

Sumitra
Updated on: 7 July 2020 4:23 PM IST
Tamilisai SoundaraRajan conference With Private Hospitals: కరోనా బాధితులకు భరోసా కల్పించాలి : గవర్నర్ తమిళిసై
X

Tamilisai SoundaraRajan conference With Private Hospitals: తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నగరంలోని 11 ప్రయివేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు పాల్గొన్నాయి. కరోనా సోకిన బాధితులు ఎవరు ఆస్పత్రికి వచ్చినా వారికి ఖచ్చితంగా చికిత్స అందించాలని తెలిపారు. కరోనా రోగుల పట్ల వైద్యులు మానవత్వంతో వ్యవహరించి వారికి చికిత్స అందించాలని ఆమె కోరారు. వైద్యులు బాధితులతో సానుకూలంగా ఉండి వారికి బతుకు పట్ల భరోసా కల్పించాలని హాస్పిటల్ యాజమాన్యాలకు గవర్నర్ సూచించారు. ప్రయివేటు ఆస్పత్రులకు వచ్చే బాధితుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ఛార్జీలు వసూలు చేయొద్దని తెలిపారు.

ప్రయివేటు ల్యాబ్ యాజమాన్యాలు బాధ్యతాయుతంగా టెస్టులు నిర్వహించాలని తెలిపారు. అవసరమైతే కార్పొరేట్ హాస్పిటళ్లకు అనుబంధంగా ఉన్న వైద్య కళాశాలల సాయం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. గత కొద్ది రోజులుగా కరోనా బాధితులు ప్రయివేట్ హాస్పిటళ్లకు వెళ్లగా బెడ్లు లేవనే సమాధానం ఇవ్వడంతో వారు ప్రాణాపాయ స్థితిలోనూ వారు ఐదారు హాస్పిటళ్ల చుట్టు తిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ విషయాన్ని గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితి తలెత్తొద్దని ప్రయివేట్ హాస్పిటళ్లను హెచ్చరించారు.

ఇక పోతే తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా రాష్ట్రంలో 1831 కరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,733కు చేరుకుంది. ఇక కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 11 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 306 కు చేరింది. సోమవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1419 కేసులు వచ్చాయి. ఇక మిగిలిన కేసులు రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 117, కరీంనగర్ జిల్లాలో 05, సంగారెడ్డిలో 03, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ అర్బన్,నిజామాబాద్, పెద్దపెల్లిలో 09, మెదక్, మంచిర్యాల్ లలో 20, ఖమ్మంలో 21, జగిత్యాల్ 04, మహబూబ్ బాద్, గద్వాల్, నారాయణపేట , యదాద్రి లలో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఇక అటు కరోనాతో నిన్న ఒక్కరోజే 2078 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 2078 మంది కోలుకోవడంతో ఇప్పటివరకూ మొత్తం 14,781 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 10,646 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఇక సోమవారం కొత్తగా 6,383 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,22,218 మందికి పరీక్షలు నిర్వహించారు.



Sumitra

Sumitra

Next Story