మేయర్‌ పీఠంపై ఉత్కంఠ.. ఎక్స్‌అఫిషియోలతోనూ మ్యాజిక్‌ ఫిగర్‌కు టీఆర్ఎస్ దూరమే

మేయర్‌ పీఠంపై ఉత్కంఠ.. ఎక్స్‌అఫిషియోలతోనూ మ్యాజిక్‌ ఫిగర్‌కు టీఆర్ఎస్ దూరమే
x
Highlights

బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. ఏ పార్టీ మేజిక్‌ ఫిగర్‌ సాధించకపోవడంతో హంగ్‌ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం...

బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. ఏ పార్టీ మేజిక్‌ ఫిగర్‌ సాధించకపోవడంతో హంగ్‌ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 48 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. మరి మేయర్ పీఠంపై ఎవరు అధిరోహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మేయర్ పీఠం మళ్లీ తామే కైవసం చేసుకుంటామని ప్రకటించుకున్న టీఆర్ఎస్ ఇరకాటంలోపడింది. గ్రేటర్ ఫలితాలు తారుమారయ్యాయి. టీఆర్ఎస్-బీజేపీ నువ్వా నేనా అంటూ ఫలితాల్లో దూసుకెళ్లాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీనే ముందుంజలో కొనసాగింది. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేశాక టీఆర్ఎస్ కాస్త పుంజుకుంది. అయినా అంతగా ప్రభావం చూపించలేదు. 55 సీట్లకే టీఆర్ఎస్ పరిమితం అయ్యింది. ఇక బీజేపీ కూడా అంతే స్థాయిలో దూసుకు వచ్చింది. 48 డివిజన్లలో బీజేపీ గెలిచి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఎంఐఎం 44 డివిజన్లలో తన పట్టును నిలుపుకోగా కాంగ్రెస్ మాత్రం కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. దీంతో అధికార పక్షం టీఆర్ఎస్ కు మేయర్ పీఠం కష్టంగానే మారింది. టీఆర్ఎస్ కు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నా మేయర్ పీఠం దక్కాలంటే 64 మంది కార్పొరేటర్లు గెలువాల్సి ఉంది. కానీ కారు జోరు అంతగా లేకుండా పోయింది. ఒక వేళ ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సి ఉంటుంది.

గ్రేటర్ ఎన్నికల్లో కత్తులు దూసుకున్న టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య కానీ ఎంఐంఐ-బీజేపీ మధ్యకాని పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదు. ఇక ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ మేయర్‌ పీఠాన్ని అధిరోహించాలంటే ఎంఐంఎం మద్దతు తప్పని సరి. అయితే నిన్నటి వరకు తమకు ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదంటూ ప్రచారం చేసుకున్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఖచ్చితంగా పతంగి పార్టీ మద్దతు తీసుకోవాల్సిందే. ఇలాంటి తరుణంలో ఎంఐఎం, టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తుందా లేదా ఒకవేళ ఇచ్చినా ఎలాంటి షరతులు పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏకంగా మేయర్ కుర్చీ తమకు ఇవ్వాలని ఎంఐఎం అడిగే ఛాన్స్ కూడా ఉందని ప్రచారం సాగుతోంది. డిప్యూటీ మేయర్‌తో సరిపెట్టుకోవాలని టీఆర్ఎస్ బేరసారాలు సాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల అధినేతల మధ్య అంగీకారం కుదిరితేనే హంగ్​తో బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది.

2009లోనూ ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్‌లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ, ఎంఐంఎంతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్‌, ఎంఐఎం కూడా ఇలాంటి అవగాహనకు వస్తాయా టీఆర్ఎస్‌, ఎంఐఎం కలిసి అధికారం పంచుకుంటాయా లేక ఒకరు మేయర్, మరొకరు డిప్యూటీ మేయర్ తీసుకుంటారా అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. టీఆర్ఎస్ ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories