నగరంలో ఏండ్ల నాటి భవనాల కూల్చివేత : ఓనర్లకు నోటీసులు జారీ

ఎన్నో ఏండ్లక్రితం కట్టిన పాత భవంతులు వర్షాలకాలంలో నానిపోయి వాటి సత్తువ కోల్పోయి కూలిపోతుంటాయి.

Sumitra
Updated on: 16 Jun 2020 5:05 PM IST
నగరంలో ఏండ్ల నాటి భవనాల కూల్చివేత : ఓనర్లకు నోటీసులు జారీ
X
Representational Image

ఎన్నో ఏండ్లక్రితం కట్టిన పాత భవంతులు వర్షాలకాలంలో నానిపోయి వాటి సత్తువ కోల్పోయి కూలిపోతుంటాయి. దీంతో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, మరికొంత మంది గాయాలపాలు కావడం వంటి సంఘటనలు ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా పాత భవనాలు ఉన్న హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంటున్నాయి. కాగా ఇలాంటి సంఘటనలను ఎన్నింటినో చూసిన ప్రభుత్వం వాటికి చెక్ పెట్టడానికి ఓ నిర్ణయం తీసుకుంది. నగరంలోని పాత భవనాల కూల్చివేత కోసం హైదరాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా జంట నగరాల్లో ఉన్న సుమారు 70 ఏళ్ల నాడు కట్టి ప్రమాదకర స్థాయిలో ఉన్న 60 పాత భవంతులను బల్దియా గుర్తించింది.

అనంతరం వాటిని బుల్డోజర్‌ల సాయంతో కూల్చి వేస్తున్నారు. వర్షాకాలంలో భవంతులు కూలి ఎవరూ కూడా ప్రాణాలను కోల్పోకూడదనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ నగర ప్రణాళిక విభాగం అధికారి మోహన్ మాట్లాడుతూ నగరంలోని ఉన్న పాత భవంతులన్నీ దశాబ్దాల క్రితం మట్టి, ఇటుకలతో నిర్మించినవి ఆయన వెల్లడించారు. ఎండలు, వానలకు ఆ పాత కట్టడాలు నానిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయని స్పష్టం చేసారు. పాత భవంతుల వివరాలను 2016లో సర్వే చేసి తీసుకున్నామని, ఆ సర్వే ప్రకారం బేగంపేట్‌లో 150 వరకూ పాత భవంతులను కూల్చివేసామని తెలిపారు.

ఇటు తార్నాకలో కూడా 95 పురాతన కట్టడాలను గుర్తించి వాటిని కూడా దశల వారిగా కూల్చే పని చేపట్టబోతున్నామని స్పష్టం చేసారు. వీటిని ఇలాగే వదిలేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉన్న భవనాలను గుర్తించి ఇప్పటికే ఆ భవనాలకు సంబంధించిన యజమానులకు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చిందని ఆయన స్పష్టం చేసారు. వీరిలో కొంత మంది తమ భవనాలను రీమోడలింగ్ చేయించుకొని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందుతామని చెబుతున్నారు.

Sumitra

Sumitra

Next Story