Formula E Car Race: ఈడీని మరింత సమయం కోరిన కేటీఆర్

విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలని కేటీఆర్ ఈడీని ఆ లేఖలో కోరారు.

లోడె నర్సింహ్మ
Updated on: 6 Jan 2025 8:36 PM IST
Formula E Car Race:KTR Writes Letter To Enforcement Directorate
X

Formula E Car Race: ఈడీని మరింత సమయం కోరిన కేటీఆర్

Formula E Car Race: కేటీఆర్ (KTR) ఈడీ (Enforcement Directorate)కు సోమవారం లేఖ రాశారు. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో (Formula E Car Race)జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు పంపింది. అయితే విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం ఇవ్వాలని కేటీఆర్ ఈడీని ఆ లేఖలో కోరారు.

ఏసీబీ నమోదు చేసిన పిటిషన్ ను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందని.. ఈ తీర్పు వెలువడేవరకు విచారణకు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈడీ పంపిన నోటీసులకు సమాధానంగా కేటీఆర్ ఈ లేఖను పంపారు. ఫార్మూలా ఈ కారు రేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు రావాలని కేటీఆర్ తో పాటు ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు పంపింది.

అయితే విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని ఈడీని బీఎల్ఎన్ రెడ్డి కోరారు. దీంతో జనవరి 2న విచారణకు హాజరుకావాల్సిన బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో జనవరి 8న బీఎల్ఎన్ రెడ్డిని, జనవరి 9న అరవింద్ కుమార్ ను విచారణకు రావాలని మరోసారి ఈడీ నోటీసులు పంపింది.

అయితే తాజాగా కేటీఆర్ పంపిన లేఖపై ఈడీ మరో తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఫార్మూలా కారు రేస్ కేసులో ఏసీబీ మరోసారి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. జనవరి 9న విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు జనవరి 7న తీర్పును వెల్లడించనుంది.

ఫార్మూలా ఈ కారు రేసులో నిబంధనలు ఉల్లంఘించారని కేటీఆర్ పై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. అయితే అవినీతి జరగనప్పుడు ఏసీబీ చట్టం కింద కేసులు నమోదు చేయడాన్ని కేటీఆర్ తప్పుబడుతున్నారు. ఇదే వాదనను ఆయన హైకోర్టులో కూడా వినిపించారు.


లోడె నర్సింహ్మ

లోడె నర్సింహ్మ

Next Story