Fever Survey: తెలంగాణలో ద‌డ పుట్టిస్తున్న ఫీవ‌ర్ స‌ర్వే

Fever Survey: తెలంగాణ‌లో చేసిన ఫీవ‌ర్ స‌ర్వే సంచ‌ల‌న నిజాలు తెలిపింది.

Arun Chilukuri
Published on: 13 May 2021 1:33 PM IST
Fever Survey Finds over 1319 Persons with COVID-19 Symptoms in Nizamabad
X

Fever Survey: తెలంగాణలో ద‌డ పుట్టిస్తున్న ఫీవ‌ర్ స‌ర్వే

Fever Survey: తెలంగాణ‌లో చేసిన ఫీవ‌ర్ స‌ర్వే సంచ‌ల‌న నిజాలు తెలిపింది. సెకండ్ వేవ్ పెద్దగా తీవ్రత చూప‌ట్లేద‌ని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో నిజాలు భ‌యాందోళ‌న కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో క‌రోనా ల‌క్షణాలు ఎంత‌మందికి ఉన్నాయ‌ని తెలుసుకోవ‌డానికి ఫీవ‌ర్ స‌ర్వే చేయించింది. అయితే ఇందులో విస్తుపోయే నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. నిజామాబాద్‌లో జరిగిన సర్వే జిల్లా ప్రజలను అయోమయానికి, ఆందోళనకు గురిచేస్తోంది.

కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే దడ పుట్టిస్తోంది. ఊహించని విధంగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబుతో బాధ పడుతున్న పాజిటివ్ పేషెంట్లు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. పాజిటివ్ వ్యక్తులను గుర్తించి అక్కడికక్కడే కరోనా కిట్లు అందచేస్తున్నారు వైద్యులు. నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన ఫీవర్ సర్వేలో వందల సంఖ్యలో జ్వర పీడితులు బయటపడుతున్నారు.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వైద్యఆరోగ్య శాఖ ఫీవర్ సర్వే చేపడుతోంది. వారం రోజులుగా గడపగడపకు తిరుగుతూ ఆరోగ్య సిబ్బంది ప్రజల ఆరోగ్య పరిస్ధితిపై సర్వే చేస్తున్నారు. జిల్లాలోని 520 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు 320 గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో సర్వే పూర్తి చేశారు. 80వేల ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. చాలా మందిలో జ్వరం, జలుబు, తలనొప్పి, లక్షణాలు ఉన్న బాధితులను గుర్తించారు. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోను లక్షణాలున్న వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటి వరకు చేసిన సర్వేలో సుమారు 1319 మందికి పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు ఆరోగ్య సిబ్బంది గుర్తించారు.

జిల్లాలో చేపట్టిన ఆరోగ్య సర్వేలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. చాలా ఇళ్లలో బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేలింది. పాజిటివిటీ తక్కువ శాతం ఉన్నా.. చాలా మందిలో అనేక వ్యాధులు బయటపడుతున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. అయితే త‌మ‌కు నిజంగానే క‌రోనా ఉందో లేదో తెలియ‌క ల‌క్షనాలున్న వారు ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ వారికి దూరంగా ఉండాలో వ‌ద్దో అని భ‌య‌ప‌డుతున్నారు. టెస్టులు సంఖ్య పెంచి తమకు మెరుగైన చికిత్స చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story