గ్రేటర్‌ ఫైట్‌లో భారీగా పెరిగిన చెల్లని ఓట్ల సంఖ్య

Arun Chilukuri
Updated on: 5 Dec 2020 12:30 PM IST
గ్రేటర్‌ ఫైట్‌లో భారీగా పెరిగిన చెల్లని ఓట్ల సంఖ్య
X

బ్యాలెట్‌ పద్ధతిలో గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహించడంతో కొంతమంది రాజకీయ భవిష్యత్తు తారుమారైంది. బల్దియా ఎన్నికల్లో పలువురు ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన విధంగా ఓటు వేయకపోవడంతో పోలైన ఓట్లలో చెల్లని ఓట్ల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో చూస్తే అధిక మొత్తంలో తిరస్కరించిన ఓట్ల సంఖ్య నమోదైంది. ఈవీఎంలకు అలవాటుపడ్డ హైదరాబాదీలు బ్యాలెట్‌ పత్రాలపై తమ ఓటును తప్పుగా వేయడంతో చెల్లని ఓట్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

గ్రేటర్‌ ఫైట్‌లో టీఆర్ఎస్‌, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కొన్ని డివిజన్లలో ఈ రెండు పార్టీల మధ్య టఫ్‌ ఫైట్ ఉండగా అక్కడ చెల్లని ఓట్లు నమోదై అభ్యర్థుల భవితవ్యాన్ని తలకిందులు చేశాయి. 144వ డివిజన్ మెట్టుగూడలో మొత్తం 39వేల 268 ఓట్లుండగా, 16 వేల 852 ఓట్లు పోలయ్యాయి. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి సరితకు 7వేల 592 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శారదకు 7 వేల 8 ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ నోటాకు 230 ఓట్లు రాగా, 340 ఓట్లు చెల్లలేదు. దీంతో బీజేపీ స్వల్ప తేడాతో సీటు కోల్పోయింది.

హబ్సీగూడలో బీజేపీకి 10 వేల 803, టీఆర్‌ఎస్‌కు 9వేల 356 ఓట్లురాగా, నోటాకు 218, చెల్లని ఓట్లు 426 పడ్డాయి. వనస్థలిపురంలో బీజేపీకి 9వేల 214 ఓట్లు, టీఆర్ఎస్‌కు 8వేల 512 ఓట్లురాగా, నోటాకు 259 ఓట్లు పడ్డాయి. మరో 268 ఓట్లు చెల్లకపోవడంతో గెలుపు తడపడింది. ఇవేకాదు సుమారు 120 డివిజన్లలో ప్రతి చోటా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి డివిజన్‌లో నోటాకు 100 నుంచి 300 ఓట్లు పడటం, అవే వార్డుల్లో చెల్లని ఓట్ల సంఖ్య 300 నుంచి 500 దాకా ఉండటం గెలుపోటములను మార్చేశాయి.

బ్యాలెట్ పై ఏ రకంగా ఓటేసినా దాన్ని చెల్లుబాటుగా పరిగణించాలని ముందుగా ఎస్ఈసీ భావించింది. కానీ అందుకు హైకోర్టు నో చెప్పడం స్వస్తిక్ గుర్తు స్పష్టంగా పడిన ఓట్లను మాత్రమే లెక్కించాలని ఆదేశించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story