ఆ జిల్లాను వణికిస్తున్నవరుస ఎన్ కౌంటర్లు

Arun Chilukuri
Published on: 15 Sept 2020 10:30 AM IST
ఆ జిల్లాను వణికిస్తున్నవరుస ఎన్ కౌంటర్లు
X

representative image


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వరుస ఎన్ కౌంటర్లు వణికిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో అని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. చత్తీస్ ఘడ్ నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన మావోలను నియంత్రించాలని పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యుడు చనిపోయాడు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకే చర్ల ఏజెన్సీలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఈ రెండు ఘటనలతో అడవి ప్రాంతాల్లో అలజడి మొదలైంది. తెలంగాణలో అధికార పార్టీ నాయకులే లక్ష్యంగా మావోలు వ్యూహ రచన చేస్తుండడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

పది రోజుల క్రితం మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు కొత్తగూడెం, ఇల్లందు ఏరియాల్లో సంచరించినట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, భద్రాచలం, చర్ల ములుగు జిల్లాలోని తాడ్వాయి, మంగపేట, ఏటురునాగారం, మహబూబాబాద్ జిల్లాలోని గంగారం, పాకాల అడవుల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వరుస ఎన్ కౌంటర్ల కారణంగా ఏజెన్సీ పల్లెల్లో నిఘా మరింత పెంచారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వారిపై ఫోకస్ పెట్టారు. మావోల కోసం పోలీసులు జరుపుతున్న కూంబింగ్ తో భద్రాద్రి ఏజెన్సీలో అప్రకటిత యుద్ద వాతావరణం నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story