దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం

Arun Chilukuri
Published on: 3 Nov 2020 7:39 AM IST
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
X

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన బందోబస్తు, కరోనా నిబంధనల మధ్య పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. 23మంది అభ్యర్థులు ఉపఎన్నిక పోటీలో నిలవగా.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. నియోజకవర్గంలో లక్షా 98వేలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నియోజకవర్గవ్యాప్తంగా 315 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్‌లోనూ కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే.. ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర.. మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులను అందుబాటులో ఉంచారు. సమస్యాత్మకంగా గుర్తించిన 89 పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.

పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్ల మధ్య భౌతికదూరం తప్పనిసరిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎవరికైనా జ్వరం ఉన్నట్టు అనిపిస్తే... వారికి పోలింగ్‌ చివరి గంటలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు సంతకం చేస్తారు. దీంతో ఓటర్లకు గ్లౌజులను అందిస్తున్నారు. ఒకవేళ కోవిడ్‌ బాధితులు అయితే వారు పీపీఈ కిట్లను ధరించి ఓటు వేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఒక్కొక్క ఈవీఎంలో 16మంది అభ్యర్థులు.. ఇలా నోటాతో కలిపి మొత్తం 24కాలమ్స్ ఉండనున్నాయ్. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఆధ్వర్యంలో... 6వందల మంది అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story