చివరిదశకు చేరిన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం

Arun Chilukuri
Published on: 31 Oct 2020 12:11 PM IST
చివరిదశకు చేరిన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం
X

దుబ్బాకలో రాజకీయపార్టీల ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి ముగింపు తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీలు జోరుపెంచాయి. ప్రధానంగా గెలుపై పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అటు ప్రధాన పార్టీల రాష్ట్ర నాయకత్వమంతా దుబ్బాకలోనే మకాం వేసి తమ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నాయి.

దుబ్బాక ఉపఎన్నికను టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్‌ భావిస్తుండగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అటు ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని ఆరోపిస్తోంది.

ప్రచారంలో టీఆర్ఎస్‌ ప్రధానంగా బీజేపీపై దృష్టిసారించింది. అబద్దాలే పునాదిగా బీజేపీ ప్రచారం చేస్తోందని మంత్రి హారీష్‌ రావు ఆరోపిస్తున్నారు. ఉపఎన్నికలో ఒక్క నాయకుడు కూడా నిజాలు మాట్లాడటం లేదని తప్పుబట్టారు. అటు కేంద్ర నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారంటూ ర్యాలీలు, సభల్లో ప్రస్తావిస్తున్నారు మంత్రి హరీష్‌ రావు.

ఇక రఘునందన్‌ రావు తరపున ఎన్నికల ప్రచారం చేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కేసీఆర్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రజల మద్దతుపై ఆధారపడి పోటీ చేస్తుంటే టీఆర్ఎస్‌ అధికారంపై ఆధారపడిందన్నారు. కిందపడ్డా కూడా తమదే పైచేయి అన్నట్టు అధికార పార్టీ వ్యవహరిస్తోందన్నారు.

మొత్తానికి దుబ్బాక ఉపపోరు తారాస్థాయికి చేరింది. పరస్పర ఆరోపణలతో అధికార, విపక్షపార్టీల నేతలు ఉపఎన్నికను మరింత హీటెక్కించారు. మరి ఈ త్రిముఖ పోరులో పైచేయి ఎవరిదో చూడాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి మరి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story