Drunk and Drive: పోలీసుల ప్రాణాల మీదికి తెస్తున్న డ్రంక్​ అండ్ డ్రైవ్ తనిఖీలు

Drunk and Drive: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ప్రజల కోసం నిర్వహిస్తున్న తనిఖీలు పోలీసుల ప్రాణాల మీదికే వస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 28 March 2021 2:51 PM IST
Drunk and Drive: పోలీసుల ప్రాణాల మీదికి తెస్తున్న డ్రంక్​ అండ్ డ్రైవ్ తనిఖీలు
X

Drunk and Drive: పోలీసుల ప్రాణాల మీదికి తెస్తున్న డ్రంక్​ అండ్ డ్రైవ్ తనిఖీలు

Drunk and Drive: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ప్రజల కోసం నిర్వహిస్తున్న తనిఖీలు పోలీసుల ప్రాణాల మీదికే వస్తున్నాయి. మద్యం సేవించిన వాహనదారులు పట్టుబడితే శిక్షలు తప్పదని తప్పించుకునే క్రమంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి వాహనాలను పోనిచ్చి గాయపరుస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సైబరాబాద్‌ పోలీసులు మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలను గుర్తించిన పోలీసులు ఇకపై తాగి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని తీర్మానించారు. రోజూ విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నారు. వరుసగా రెండుసార్లు పోలీసులకు దొరికితే రూ. 15 వేల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా కేసులు నమోదు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ సోదాలు జరగనున్నాయి.

జంటనగరాల పరిధిలో గత వారం రోజుల్లో మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల డజన్ల సంఖ్యలో ప్రమాదాలు జరగడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణనిస్తున్నారు. ఇటీవల కొవిడ్‌ కారణంగా పోలీసుల తనిఖీలు విరమించటం వల్ల మందు బాబులు రెచ్చిపోతున్నట్టు గుర్తించారు. తాగి రోడ్లపైకి వచ్చి ప్రమాదాలు చేయటమే కాక అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ తరహ ఘటనలపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు. అయినా మందుబాబుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు అడ్డొచ్చిన పోలీసులను సైతం గుద్ది పారిపోతున్నారు. హైదరాబాద్‌లో ​నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీల్లో పోలీసులే గాయపడ్డారు.

నగర శివార్లలోని నిజాంపేట్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఏఎస్‌ఐ, హోంగార్డును రెండు వాహనాలు ఢీకొట్టాయి. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సృజన్‌ అనే వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో హోంగార్డును ఢీ కొట్టాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అదే సమయంలో అస్లాం అనే మరో వ్యక్తి తన కారుతో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డిని ఢీకొట్టాడు. దాంతో మహిపాల్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. రెండు ప్రమాదాలపై కేసు నమోద చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు సృజన్‌, అస్లాంను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు మద్యం సేవించి రోడ్డెక్కిన పాదచారులు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇక నుంచి పాదచారులు సైతం మద్యం సేవిస్తే రోడ్డుపైకి రావద్దని పోలీసులు సూచిస్తున్నారు. శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story