Dilsukhnagar Bomb Blast: జంట బాంబు పేలుళ్ళ విషాదానికి ఎనిమిదేళ్ళు!

Dilsukhnagar Bomb Blast: దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు జరిగి నేటితో ఎనిమిదేళ్లు పూర్తయింది.

K V D Varma
Published on: 21 Feb 2021 7:33 AM IST
Dilsukhnagar Bomb Blast eight years for tragic incident
X

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లకు ఎనిమిదేళ్లు (ఫైల్ ఫోటో)

Dilsukhnagar Bomb Blast: సాయంత్రం సమయం.. కోలాహలంగా.. ప్రశాంతంగా ఉందా ప్రాంతం. ఇంతలో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం.. ఆ షాక్ నుంచి తేరుకునే లోగానే మరోసారి పేలుడు.. అంతే.. అక్కడి ప్రశాంతత చెదిరిపోయింది. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా రక్తంతో నిండిపోయింది. ఎటుచూసినా బాంబు పేలుళ్ళ ధాటికి చెల్లా చెల్లా చెదరైన పరిసరాలు.. తమ వారు కనపడక అటూ ఇటూ పరుగులు తీస్తున్న వారు.. పేలుడు తాకిడికి క్షతగారులైన వారి ఆర్తనాదాలు.. హైదరాబాద్ చరిత్రలో మరిచిపోలేని దుర్ఘటన అది. ఆ ప్రాంతం దిల్‌సుఖ్‌నగర్‌.

దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు జరిగి నేటితో ఎనిమిదేళ్లు పూర్తయింది. ఉగ్రవాదుల దుశ్చర్యకు అయిన వారిని కోల్పోయిన హృదయాలని జీవితాంతం వెంటాడే ఈ దుర్ఘటన ఇంకెంతో మందిని జీవితాంతం జీవచ్చవాలని చేసింది. ఆ దుర్ఘటన గుర్తొస్తే కన్నీళ్లు ఆగడం లేదంటున్నారు దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల బాధితులు.

అది 2013, ఫిబ్రవరి 21వ తేదీ. సమయం రాత్రి ఏడు గంటలు అవుతుండగా దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్ థియేటర్ సమీపంలో కొద్ది క్షణాల వ్యవధిలోనే స్వల్ప దూరంలోనే ముష్కరులు టిఫిన్ బాక్సులలో అమర్చిన రెండు బాంబులు పేలాయి. ముష్కరులు జరిపిన ఈ జంట పేలుళ్లలో 19 మంది దుర్మరణం పాలుకాగా మరో 120 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొంతమంది శాశ్వతంగా అంగవైకల్యం బారిన పడి జీవచ్చవాలుగా వీల్ చైర్లకే పరిమితమైన వాళ్లూ వున్నారు. అందుకే ప్రతీ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ వారికి ఓ పీడకలగా మిగిలిపోయింది. నాటి చేదు జ్ఞాపకాన్ని తల్చుకుంటూ ఆ రోజు జరిగిన మొత్తం ఉదంతంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి స్థానికులు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్‌ఐఏ పేలుడు జరిగిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్‌కి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఘటనా స్థలంలో లభించిన కీలక ఆధారాలు, సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా ఐదుగురు నిందితులను గుర్తించిన ఎన్‌ఐఏ అధికారులు వారిని అరెస్టు చేశారు. రియాజ్ భత్కల్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అసదుల్లా అక్తార్ అలియాస్ హడ్డీ, బీహార్‌కు చెందిన మహమ్మద్ తహాసీన్ అక్తార్, పాకిస్తాన్‌కు జియా ఉర్ రహ్మన్ అలియాస్ వఖాస్, కర్నాటకకు చెందిన మహమ్మద్ అహ్మద్ సిదిబాప అలియాస్ యాసిన్ భత్కల్, మహారాష్ట్రకు చెందిన ఎజాజ్ సయీద్ షేక్ గా ఎన్ఐఏ గుర్తించింది.

K V D Varma

K V D Varma

Next Story