అర్వింద్‌ వర్సెస్‌ కవిత.. ఎవరికి ఎవరు పెడుతారు వాత?

Dharmapuri Arvind Kumar Vs Kavitha in Nizamabad
x

అర్వింద్‌ వర్సెస్‌ కవిత.. ఎవరికి ఎవరు పెడుతారు వాత?

Highlights

Nizamabad: వాళ్లిద్దరూ ఇద్దరే. ఒకరంటే ఒకరికి పడని రాజకీయ వైరం. ఎంతలా అంటే.. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతలా.

Nizamabad: వాళ్లిద్దరూ ఇద్దరే. ఒకరంటే ఒకరికి పడని రాజకీయ వైరం. ఎంతలా అంటే.. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతలా. ఎంపీగా ఐదేళ్ల పాటు పని చేసి దేశ స్దాయిలో గుర్తింపు పొందిన నాయకురాలు ఒకరైతే తొలిసారి ఎంపీగా గెలిచి యూత్‌లో క్రేజీ సంపాదించుకున్న మాస్ లీడర్ మరొకరు. ఆయన టార్గెట్ ఆమె ఆమె కుటుంబం. ఆమె మాత్రం సైలెంట్‌గా ఆ ఎంపీకి చెక్ పెడుతూ ఓడిన చోటే క్రేజ్‌ సంపాదిస్తోంది. అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అని ఆయన అంటుంటే చాన్స్‌ వస్తే తానూ వదలుకోనని ఆమె కూడా కుండబద్దలు కోడుతోందట. ఇంతకీ ఇందూరులో సెగ పుట్టిస్తున్న ఆ ఇద్దరు నేతలెవరు? ఆ ఇద్దరు నేతల వైరానికి కారణాలేంటి? ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నా చివరికి పై చేయిఎవరిది? ఆ ఎంపీ- ఎమ్మెల్సీల పొలిటికల్ వార్ ఏంటి?

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య సై అంటే సై అనేలా రాజకీయ యుద్ధం సాగుతోంది. ఒకరి ఎత్తులకు మరొకరు పైఎత్తులు వేస్తూ పొలిటికల్ చదరంగం ఆడుతున్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత తన పార్లమెంట్ సెగ్మెంట్‌తో పాటు రాష్ట్రస్థాయిలో లీడర్‌గా మంచి గుర్తింపు సాధించారు. పార్లమెంట్‌లోనూ జిల్లా, రాష్ట్ర సమస్యలపై గళమెత్తి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కూడా గుర్తింపు పొందారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ చేతిలో ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. పసుపు బోర్డు హామీతో అర్వింద్‌‌కు రైతులు జైకొట్టడం కవితకు పరాజయం మిగిల్చింది.

అయితే, ఎంపీగా గెలిచిన అర్వింద్ కవితతో పాటు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. సందర్భం దొరికినప్పుడల్లా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. తాను ప్రస్తుతానికి పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ గనుక ఆదేశిస్తే ఎవరి మీదైనా పోటీకి సిద్దమన్నారు. అక్కడ ఇక్కడ కాదు ఎక్కడి నుంచైనా సరే ఎవరి మీదైనా సరే అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు బదులుగా ఎమ్మెల్సీగా ఉన్న కవిత వచ్చే ఎన్నికల కోసం గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. తనకు మంచి పట్టున్న నిజామాబాద్‌ జిల్లాలో ఏ నియోజకవర్గమైనా తనకు ఓకే అన్నట్టుగా ఇప్పటికే కొన్ని సంకేతాలను ఇచ్చినట్టుగా క్యాడర్‌ చెప్పుకుంటోంది. అదీగాక, ఎంపీ అర్వింద్‌ ఇంత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నా ఆమె మాత్రం నేరుగా విమర్శ చేయకపోయినా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంపీ అర్వింద్‌పై ఎదురు దాడికి దిగేలా స్కెచ్ వేశారు. ఇలా ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోందని ఇందూరు ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

కాకపోతే, పసుపు బోర్డు ఏర్పాటు చేసేది లేదంటూ కేంద్రం ఇచ్చిన ప్రకటన గులాబీ పార్టీకి కొత్త అస్త్రం ఇచ్చినట్లయింది. పసుపు బోర్డు కోసం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీని, ఆ పార్టీ ఎంపీ అర్వింద్‌ను నిలదీస్తున్నారు. గులాబీ నేతలు పసుపు బోర్టు అంటే నిజాం చక్కర కర్మాగారం పునరుద్దరణ అంటూ కాషాయ నేతలు కొత్త పల్లవి అందుకుంటున్నారు. చక్కర ఫ్యాక్టరీను పునరుద్దరించాలని ప్రగతిభవన్ మట్టడికి అప్పట్లో కమలం నేతలు యత్నించారు. ఇలా పసుపు బోర్డు- చక్కర ఫ్యాక్టరీల అంశంపై ఆ ఇద్దరు నేతలు సై అంటే సై అంటూ పోటాపోటీ ధర్నాలు, నిరసనలు చేపట్టేలా కార్యకర్తలు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారని టాక్‌.

ఇంతటితో ఆగకుండా సోషల్ మీడియాలోనూ ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటున్నారు. పై చేయి కోసం ప్రతీ అవకాశాన్ని వాడుకుంటున్నారు. కాషాయ పార్టీ జై శ్రీరాం నినాదంతో ప్రజల్లోకి వెళ్తుంటే కొండగట్టు అంజన్న సాక్షిగా అఖండ హనుమాన్ చాలీసా చేపట్టిన కవిత రామభక్త హనుమాన్ నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలా బీజేపీ ఎత్తులను టీఆర్ఎస్ చిత్తు చేస్తుంటే ఆ ఎమ్మెల్సీ ప్రతీ కదలికలపై నిఘా పెడుతూ కాషాయ పార్టీ అలెర్ట్‌గా ఉందని చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతలు పైకి కత్తులు దూయకున్నా లోలోపలా పొలిటికల్ పంచ్‌లతో హీట్ పెంచేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఏమైనా నిజామబాద్ ఎంపీ అర్వింద్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఉప్పునిప్పులా ఉన్నారు. జిల్లాలో పట్టు సాధించేందుకు ఎంపీ పావులు కదుపుతుంటే పార్టీ బలోపేతంపై స్వయంగా కవిత రంగంలోకి దిగారట. జిల్లాలో బీజేపీ వేసే ప్రతీ అడుగును సైలెంట్‌గా పరిశీలిస్తున్నారట. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాను పార్లమెంట్ సెగ్మెంట్‌ను క్లీన్ స్వీప్ చేయాలని అర్వింద్‌ వ్యూహాం రచిస్తున్నారట. సీఎం కేసీఆర్‌ కూతురిగా, జాగృతి నాయకురాలిగా ఎమ్మెల్సీగా, తన సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో కవిత స్ధానం సంపాదించుకుంటే ఎంపీగా గెలిచిన అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చిన్నారుల గుండె ఆపరేషన్లు, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్, యూత్ లో క్రేజీతో తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు సాధించారు. కాకపోతే అర్వింద్‌‌కు పసుపు బోర్డు అంశం మైనస్‌గా ఉన్నా కాషాయ పార్టీకి పెరుగుతున్న ఆదరణ ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉందట. ఇంతకీ ఎమ్మెల్సీ- ఎంపీ పొలిటికల్ వార్‌లో ఎవరి గెలుస్తారు? ఎవరు పై చేయి సాధిస్తారో తెలుసుకోవాలంటే వేచి చూడక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories