Coronavirus tension in TRS: గులాబీ నేతల్లో కరోనా టెన్షన్

Coronavirus tension in TRS: తెలంగాణలో అధికార పార్టీకి కరోనా టెన్షన్ పట్టుకుందా..?

Arun Chilukuri
Published on: 30 Jun 2020 9:25 PM IST
Coronavirus tension in TRS: గులాబీ నేతల్లో కరోనా టెన్షన్
X

Coronavirus tension in TRS: తెలంగాణలో అధికార పార్టీకి కరోనా టెన్షన్ పట్టుకుందా..? కరోనా విషయంలో గులాబీ నేతలు ఇచ్చిన స్టేట్ మెంట్స్.. పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయా..? నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల, ప్రజల ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో ఏం చెప్పారు..?

కరోనా వైరస్... ఈ పేరు చెబుతే చాలు ప్రపంచం వణికిపోతోంది. కోవిడ్ -19 బారిన పడి ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు అయితే ఈ వైరస్ ప్రజల పైనే కాదు పార్టీల పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తెలంగాణలో అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ పై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రతిపక్షాలు టీఆర్ఎస్‌ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కేర్ లెస్ గా ఉందనే విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పారాసిటమాల్ డైలాగ్ నుంచి కరోనా పరీక్షలు, వాటి రిపోర్టుల్లో జాప్యంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేశాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుమ్మెత్తిపోశాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌-19ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని గులాబీ లీడర్స్ అపోజిషన్ లీడర్ల విమర్శలను తిప్పుకొట్టారు. కేంద్రం గైడ్‌లైన్స్, ఐసీఎమ్ఆర్ నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేస్తున్నామంటూ రివర్స్ ఎటాక్ చేశారు.

అయితే ఇప్పుడు సీన్ మారింది అన్ లాక్ వన్ తరువాత రాష్ట్రంలో రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ డిఫెన్స్ లో పడింది. జిల్లాల్లో వైద్య సదుపాయాలపై ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ నిలదీస్తుండటంతో గులాబీ నేతల్లో కలవరం మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది క్రమంగా పార్టీ పైనే ప్రభావం పడే అవకాశం ఉందని గ్రహించిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారట. కరోనాకు బ్రేక్ వేయకపోతే జనాగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారట.

మొత్తంగా పెరుగుతున్న కరోనా కేసులతో అధికార పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రతి పక్షాలను అటుంచితే ఏకంగా ప్రజల నుంచే ఆగ్రహ జ్వాలలు మొదలైన వేళ కరోనాకు లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story