Coronavirus Pandemic Destroying Small Scale Industries: కరోనా కారణంగా చితికిపోతున్న చిన్నపరిశ్రమలు

Arun Chilukuri
Published on: 21 July 2020 4:14 PM IST
Coronavirus Pandemic Destroying Small Scale Industries: కరోనా కారణంగా చితికిపోతున్న చిన్నపరిశ్రమలు
X

Coronavirus Pandemic Destroying Small Scale Industries: కరోనా వైరస్ చిన్నపరిశ్రమలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. లాక్ డౌన్ సమయంలో ఆర్డర్లు కరువయ్యాయి. ఇప్పుడు సడలింపులు వచ్చాక కార్మికులు కురవయ్యారు. ఏం చేయాలో తెలియక పరిశ్రమ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఏ పరిశ్రమ గేట్ చూసినా కార్మికులు కావలెను అంటూ బోర్డులు వేలాడుతున్నాయి. కార్మికులు లేక సంగారెడ్డి జిల్లాలో వెలవెలబోతున్న పారిశ్రామిక వాడలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్.

సంగారెడ్డి జిల్లాలో వేల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేసేవారు. అన్ని రాష్ట్రాల వలస కార్మికులు ఇక్కడ ఉండడంతో సంగారెడ్డి జిల్లా పారిశ్రామికవాడను మినీ ఇండియాగా పిలిచేవారు. కానీ ఇప్పుడా వైభవం పోయింది. కరోనా ప్రభావంతో వలస కార్మికులందరూ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. పారిశ్రామిక వాడల్లోని చాలా పరిశ్రమల గేట్ల ముందు వాంటెడ్ హెల్పర్స్ అంటూ బోర్డులు వేలాడుతున్నాయి. కొన్ని పరిశ్రమలయితే కార్మికులు లేక పరిశ్రమలను పూర్తిగా మూసివేశారు. దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.

కార్మికుల సమస్యపెద్ద పరిశ్రమలను కూడా వెంటాడుతోంది. గతంలో బీహార్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన కార్మికులు ఎక్కువగా పనిచేసేవారు. వారికి ఫోన్లు చేసి ఎక్కువ జీతం ఇచ్చి వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నా ఇక్కడికి వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని పరిశ్రమలు మాత్రం లోకల్ కార్మికులకు పనులు నేర్పించి కాలం వెల్లదీస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో చిన్న పరిశ్రమలు చాలా నష్టపోయాయని యజమానులు అంటున్నారు. కరెంట్ బిల్లులను మాఫీ చేయించి ప్రభుత్వం ఆదుకోవాలని పరిశ్రమల యజమానులు కోరుతున్నారు.
Arun Chilukuri

Arun Chilukuri

Next Story