CoronaVirus: తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది పూర్తి

Arun Chilukuri
Published on: 2 March 2021 10:48 AM IST
coronavirus first case detected on 2nd march 2020 in telangana
X

CoronaVirus: తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఏడాది పూర్తి

CoronaVirus: కరోనా.. ప్రపంచం మొత్తాన్ని వణికించిన వైరస్. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఎంతో మంది సామాన్యుల జీవితాలు కుదేలైపోవడానికి కారణమైన మహమ్మారి‌. ఇక లాక్‌డౌన్‌తో కోట్లాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఎన్నో ఆకలి చావులు. వలస కూలీల పరిస్థితి అయితే వర్ణనాతీతం. సిటీలో ఉండే పరిస్థతి లేదు. ఊళ్లకు వెళ్లే అవకాశం అంతకాన్న లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే హైవేలు నిర్మానుష్యంగా మారాయి. రైల్వే ట్రాక్‌లు ఖాళీగా దర్శనమిచ్చాయి. పబ్లిక్‌తో కళకళలాడే సినిమా హాళ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు మూతపడ్డాయి. మొత్తంగా కరోనా పేరు చెబితేనే ప్రజలు హడలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది.

చైనా దేశంలోని వూహాన్‌ నగరంలో పుట్టి ప్రపంచ దేశాలన్నింటినీ చిగురుటాకులా వణికించింది కరోనా వైరస్. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2న కరోనా తొలి కేసు నమోదైంది. అంటే నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఆ తర్వాత కేసుల సంఖ్య వేలల్లో, లక్షల్లో పెరిగింది. ముఖ్యంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం పాటించినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే వచ్చేది. ఆ తర్వాత అక్టోబర్‌, నవంబర్ నుంచి కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గడం మొదలైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆంక్షలు ఎత్తివేసింది. అన్‌లాక్‌ ప్రక్రియతో జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరింది.

ఇక డిసెంబర్‌లో కొత్త స్ట్రెయిన్‌, కరోనా సెకండ్‌ వేవ్‌ అని హెచ్చరించినా తెలంగాణలో వాటి ప్రభావం కనిపించలేదు. కరోనా తగ్గిపోయింది రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోయింది. మనకేం కాదులే అన్న ధీమాతో చాలా మంది మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటించడం మానేశారు. మరోవైపు కొవిడ్‌ టీకా కూడా అందుబాటులోకి రావడంతో రాష్ట్ర ప్రజలు వైరస్‌ను చాలా లైట్‌గా తీసుకున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య మళ్లీ పెరగడం మొదలైంది. జనవరిలో తెలంగాణలో 4వేల 79 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఫిబ్రవరి వచ్చే సరికి ఆ సంఖ్య 8వేల 29కి పెరిగింది.

ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2లక్షల 98వేల 923 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి ఒక వేయి 634 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story