Coronavirus Effect: సగం అద్దె ఇచ్చినా ఓకే: కిరాయిదార్ల కోసం ఇంటి యాజమానులు ఎదురుచూపు

Coronavirus Effect: కరోనా అద్దెకిచ్చే ఇళ్ల వ్యవహారంలో వాటి స్థితిగతులనే కరో్నా తారుమారు చేసింది...

Bathula Yesu Babu
Published on: 29 Aug 2020 10:18 AM IST
Coronavirus Effect: సగం అద్దె ఇచ్చినా ఓకే: కిరాయిదార్ల కోసం ఇంటి యాజమానులు ఎదురుచూపు
X

Coronavirus Effect: కరోనా అద్దెకిచ్చే ఇళ్ల వ్యవహారంలో వాటి స్థితిగతులనే కరో్నా తారుమారు చేసింది... ఒకప్పుడు ఇంటి కోసం యాజమానులు చుట్టూ తిరిగే పరిస్థితి. వారు చెప్పిన ఆంక్షలను తూచ తప్పకుండా అమలు చేస్తామని నమ్మించి, అద్దెకు తీసుకునేవారు కిరాయిదార్లు, కరోనా పుణ్యమాని అది ప్రస్తుతం రివర్స్ అయ్యింది..,. వైరస్ తీవ్రతతో పట్టణాన్ని వదిలి లక్షల కుటుంబాలు స్వంత గ్రామాలకు వెళ్లడంతో అందరి ఇళ్ల ముందు టూలెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇలా తమ ఇళ్లల్లో ఎవరూ చేరేందుకు రాకపోవడంతో ఆశగా ఎదురు చూస్తుండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత అద్దె ఇచ్చినా ఒకేనని, ఎటువంటి షరతులు వర్తించవని చెబుతూ కిరాయిదార్ల కోసం వెంపర్లాడుతున్నారు.

కరోనా కారణంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో సొంతిళ్లు, షాపుల యజమానులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు పోర్షన్లను అద్దెకివ్వడం ద్వారా వచ్చే సొమ్ముతో దర్జాగా బతికిన పరిస్థితి నుంచి ఇప్పుడు కిరాయిదారుల్లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 'టులెట్‌ బోర్డు'లతో కాలం వెళ్లబుచ్చాల్సిన రోజులొచ్చాయని వాపోతు న్నారు. బ్యాంకు రుణాలతో కట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు.

పరిస్థితి తారుమారు: గతంలో డిమాండ్‌ ఉన్న ఏరియాలు, అన్నింటికీ అందుబాటులో ఉన్న ప్రాంతా ల్లోని ఇళ్లు అద్దెకు దొరకాలంటే గగనంగా ఉండేది. అద్దె ఇళ్ల కోసం రెంటల్‌ ఏజెన్సీలపై కూడా కిరాయిదారులు ఆధారపడాల్సి వచ్చేది. పైగా ఓనర్లు పెట్టే ఆంక్షలు, నిబంధనలు అంగీకరించాల్సి వచ్చేది. పొద్దుపోయాక రావొద్దు.. బంధువులను పిలవకూడదు.. నీళ్ల ట్యాంకును రోజుకొకసారే నింపుతాం... ఇలా అనేక షరతులకు లోబడి అద్దెకున్న వారు ఉండేవారు.

అయితే ఎప్పుడైతే కరోనా నియంత్రణకు కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించిందో అప్పటి నుంచి ఇంటి ఓనర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధి అవకాశాలు కోల్పోయి సరైన ఆదాయం రాని వారు, చిన్నాచితకా వ్యాపారాలు చేసే వారు అద్దె కట్టే పరిస్థితులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లారు. హైదరాబాద్‌లో ఇంకా కరోనా పూర్తిగా అదుపులోకి రానందున వారిలో చాలా మంది తిరిగి నగరానికి వచ్చేందుకు జంకు తున్నారు. స్వగ్రామాల్లోనే ఉపాధి వెతుక్కుంటున్నారు. దీంతో ఇళ్ల యజమానుల పరిస్థితి తారుమారైంది. నెలవారీ అద్దెలు రాకపోవడంతో గతంలో తీసుకున్న బ్యాంకు లోన్లు కట్టలేకపోతున్నారు.

సగం అద్దె ఇచ్చినా ఓకే: ఇప్పుడు కొత్తగా వచ్చే కిరాయిదారుల కోసం యజమానులు నెలల తరబడి వేచిచూడాల్సిన రోజులొచ్చాయి. దీంతో ఎవరైనా ఖాళీ చేస్తామని సూచనప్రాయంగా చెప్పినా యజమానులు కంగారుపడుతున్నారు. సగం అద్దె ఇచ్చినా పరవాలేదని బతిమాలుతున్న సందర్భాలు ఎదురవుతున్నాయి.

Bathula Yesu Babu

Bathula Yesu Babu

Next Story