CM KCR: నేను అసెంబ్లీ రద్దు చేస్తా.. ముందస్తు ఎన్నికలకు పోదాం

CM KCR Press Meet Live Updates | TS News
x

CM KCR: నేను అసెంబ్లీ రద్దు చేస్తా.. ముందస్తు ఎన్నికలకు పోదాం

Highlights

CM KCR: బీజేపీ ఎవరిని ఉద్దరించింది.. మీరంటే ఎవరికి భయం..?

CM KCR: ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తాం.. దమ్ముంటే ఎన్నికల తేదీలు ఖరారు చేయండంటూ విపక్షాలకు సవాల్‌ విసిరారు కేసీఆర్‌. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తేదీ ఖరారు చేస్తే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకెళ్తామని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. అధికారం కోసం ఏక్‌నాథ్‌ శిందేలను పుట్టించాలా? అని ప్రశ్నించారు. మున్ముందు ఏక్‌నాథ్‌ శిందేలే ఏకుమేకవుతారని వ్యాఖ్యానించారు. తాము కుంభకోణాలు చేయలేదని, ప్రజల కోసం మంచి పనులు చేశామని.. ప్రజలే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ రాజకీయమా? దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో ఏక్‌నాథ్‌ శిందేలను తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాల్‌ విసిరారు.

'భారత్‌కు చైనా అత్యంత ప్రమాదకారి. భారత్‌ - చైనా సరిహద్దు ప్రయోగశాల కాదు. 'ప్రయోగాలతో దేశానికి ముప్పు' అని మాజీ లెఫ్ట్‌నెంట్‌ జనరల్స్‌ చెప్పారు. వర్షాలకు కాశీ ఘాట్‌లో ప్రధాన గోపురం కూలిపోయింది. దేశానికి అరిష్టమని ప్రజలు బాధపడుతున్నారు. మీరేమో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నారు. తప్పకుండా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తాం.. ఎల్‌ఐసీని అమ్మనీయం. మా అజెండా ఏంటో త్వరలో చెబుతాం. నా మాదిరిగానే గుజరాత్‌లో మోదీ సీఎంగా పనిచేశారు. అందరినీ గోల్‌మాల్‌ చేసి ప్రధాని అయ్యారు. తెలంగాణ అభివృద్ధిలో ఒక్కపైసా కూడా మోదీ చేయలేదు. అయినా, దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. మోదీ గారూ.. దమ్ముంటే తమిళనాడు, తెలంగాణలో ఏక్‌నాథ్‌ శిందేలను తీసుకురండి చూద్దాం. ప్రభుత్వాలను కూలగొట్టడమే మీ రాజకీయమా? ఇతర ప్రభుత్వాలను కూలగొట్టడం గొప్ప విషయమా'.

మాతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్టే. నువ్వు గోక్కున్నా గోక్కోకపోయినా.. నేను మాత్రం గోకుతూనే ఉంటా? శ్రీలంకలో ప్రాజెక్టు ఒకటి ఆయన స్నేహితుడికే ఇచ్చారు. భారత ప్రభుత్వం నామినేట్‌ చేసిందని, మోదీ ఒత్తిడి వల్లే ప్రాజెక్టు ఇచ్చామని అక్కడి అధికారులు చెప్పారు. చరిత్రలో ఏ ప్రధాని ఆ విధంగా నామినేట్‌ చేయలేదు. భారత ప్రధాని పట్ల శ్రీలంకలో నిరసనలు తెలుపుతున్నారు. భారతదేశంలో కురిసే వర్ష పాతం లక్షా 40వేల టీఎంసీలు. నదుల నుంచి మనం తీసుకునే అవకాశమున్న నీరు 70వేల టీఎంసీలు.. ఇందులో మనం తీసుకుంటున్నది కేవలం 22వేల టీఎంసీలు మాత్రమే. 6వేల టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్‌ జింబాబ్వేలో ఉంది. భారతదేశ భూమి విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని అడ్వాంటేజ్‌ భారత్‌కు ఉంది. 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. కేంద్రం అసమర్థ విధానాల కారణంగా పిచ్చి ముఖాలు వేసుకుని మెక్‌ డొనాల్డ్‌ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. దేశంలో 52శాతం యువత ఉంది. ప్రగతి బాట పట్టాల్సిన యువతను పక్కదారి పట్టిస్తున్నారు. గుణాత్మక మార్పు రావాలి.. విప్లవ బాటలో పయనించాలి. దేశంలో కొత్త పార్టీ రావద్దా? అవసరమైతే తెరాస జాతీయ పార్టీగా మారుతుంది. తెలంగాణలో మాదిరిగా గొప్ప ప్రాజెక్టు కట్టుకోలేమా? దేశంలో అద్భుత ప్రగతికి శ్రీకారం చుట్టాలి.

'పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం, ప్రజలకు వివరిస్తాం. తప్పకుండా మిమ్మల్ని దోషులగా నిలబెడతాం. గ్యాస్‌సిలిండర్‌ ధర రూ.400 నుంచి రూ.1200లకు పెంచారు. దేశ చరిత్రలో అత్యంత అసమర్థ ప్రధాన మంత్రి మోదీ. జీడీపీ అత్యంత పతనమైన మాట వాస్తవం కాదా? ద్రవ్యోల్బణం పెరిగిన మాట వాస్తవం కాదా? రూపాయి విలువ పతనం, పెట్రోల్‌ ధరల పెంపు, కోట్లాది ఉద్యోగాలు కోల్పోతున్న మాట వాస్తవం కాదా? దేశంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నది వాస్తవం కాదా? భాజపా మత పిచ్చి రాజకీయాలతో పెట్టుబడులు తరలిపోతున్నాయి. మేకిన్‌ ఇండియా.. ఇదో పెద్ద డైలాగ్‌. దీపావళి టపాసులు, పతంగులు, జాతీయ పతాకాలు, గణపతి విగ్రహాలు చైనా నుంచి వస్తున్నాయి. దేశంలో 38శాతం పరిశ్రమలు మూతపడిన విషయం వాస్తవం కాదా? ఇదేనా మేకిన్‌ ఇండియ అంటే? అట్టర్‌ ఫ్లాప్‌ పథకం ఇది. దేశాన్ని మోదీ సర్వనాశనం చేస్తున్నారు. కేవలం భాజపాయేతర ప్రభుత్వాల్ని ముప్పుతిప్పలు పెట్టాలని చూస్తున్నారు. గత అప్పులను లెక్కించి ఎఫ్‌ఆర్‌బీఎంలో కోతలు పెడుతున్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తును మోదీ సర్వనాశనం చేస్తున్నారు. కేంద్రంలో వికృత రాజకీయ క్రీడ కొనసాగిస్తున్నారు. తెలంగాణ రైతు బంధు నిలిపివేయడానికే భాజపా ఉందా? మీ చిల్లర రాజకీయం కోసం ప్రజల్లో నోట్లో మట్టికొడతారా? రాష్ట్రాల ప్రగతి దెబ్బతీసి దేశం గొంతు పిసుకుతారా? మోదీ ప్రభుత్వం సైన్యాన్ని కూడా వదలట్లేదు. 130 కోట్ల దేశ జనాభాను ఇష్టమెచ్చినట్టు చేస్తామంటే కుదరదు. బ్లాక్‌ మనీ వెనక్కి తెస్తామన్నారు.. స్విస్‌ బ్యాంకులో బ్లాక్‌ మనీ ఇప్పుడు డబులైపోయింది. మాటలు చెప్పే ఇంజిన్‌ కాదు... దిల్లీలో మంచిగా పనిచేసే ఇంజిన్‌ ఉండాలి'' అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories