10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌: సీఎం కేసీఆర్

Arun Chilukuri
Published on: 14 Sept 2020 1:14 PM IST
10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌: సీఎం కేసీఆర్
X

రాష్ర్టంలోని రిజిస్ర్టేష‌న్ కార్యాల‌యాల్లో ఇకపై అవినీతికి ఆస్కారం ఉండబోదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. శాస‌న‌మండ‌లిలో కొత్త రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి, కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్వో వ్యవస్థ రద్దు చేశామని తెలిపారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమే అని పేర్కొన్నారు. దీంతో పీటముడి పడిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని వివరించారు. పలు చట్టాల సమాహారంగా రెవెన్యూ చట్టం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఇకపై తహసీల్దార్లు అవినీతికి పాల్పడే అవకాశం ఉండదని చెప్పారు.

ధరణి పోర్టల్‌లో మార్పులకు తహసీల్దార్లకు అధికారం లేదని వెల్లడించారు. సబ్‌ రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణాధికారం లేదని సీఎం స్పష్టం చేశారు. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ధరణి పోర్టల్‌లో అప్‌డేట్‌ కాగానే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, ఆప్‌డేషన్‌ కాపీలు వస్తాయి. రెవెన్యూ కోర్టులు రద్దు చేశాం. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లవచ్చు. కావాలని వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయదు అని సీఎం చెప్పారు. బ‌యోమెట్రిక్, ఐరిస్, ఆధార్‌, ఫోటోతో రిజిస్ర్టేష‌న్లు చేస్తామ‌న్నారు. ఈ వివ‌రాల‌న్నీ లేకుండా త‌హ‌సీల్దార్ల‌కు పోర్ట‌ల్ తెరుచుకోదు. ప‌క‌డ్బందీ వ్యూహంతో పేద రైతుల హ‌క్కులు కాపాడుతామ‌న్నారు. రైతులు, ప్ర‌జ‌లకు లంచాలు ఇచ్చే బాధ త‌ప్పాల‌నేది ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని చెప్పారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story