నాగార్జునసాగర్ ఉపఎన్నిక.. సీఎం కేసీఆర్ టూర్ పై పొలిటికల్ హీట్

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

Arun Chilukuri
Published on: 9 Feb 2021 9:03 PM IST
Kcr Tour NagarjunaSagar Tour
X

కెసిఆర్ ఫైల్ ఫోటో 

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంఖుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా హాలియాలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో సీఎం టూర్ తో పొలిటికల్ హీట్ జోరందుకుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడు వేల కోట్ల రూపాయలతో చేపట్టే ఎత్తిపోతల పథకాలకు శంఖు స్థాపన చేయనున్నారు. ఆ తర్వాత హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పర్యటనకు రావడం పొలిటికల్ హీట్ పెంచినట్లయ్యింది. అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని అధికార పార్టీ చెబుతున్నప్పటికీ..సాగర్ ఉపఎన్నిక పోరులో గెలుపే లక్ష్యంగా గులాబీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు.

ఎప్పుడైనా ఉపఎన్నికలు వస్తే ఎన్నికలసమయంలోనే ప్రచారానికి వెళ్లే సీఎం కేసీఆర్..నాగార్జునసాగర్ లో మాత్రం ఓ అడుగు ముందుకు వేశారు. గతంలో హూజూర్ నగర్ ఉపఎన్నిక ముందు సభ ఏర్పాటు చేసి వర్షం కారణంగా రద్దు కావడంతో.. గెలిచిన మరుసటిరోజునే కృతజ్ఞత సభ నిర్వహించి వరాల జల్లు కురిపించారు. ఇక దుబ్బాక ఉపఎన్నికలో సీఎం ఆ వైపే చూడలేదు. కానీ తాజా రాజకీయ పరిణామాలతో సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో నాగార్జునసాగర్ పై సమీక్ష నిర్వహించారు. అంతే కాకుండా స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టమవుతోంది. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి జగదీశ్ రెడ్జి కూడా సాగర్ ఉపఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ దే అంటూ చెప్పుకొచ్చారు.

మరో వైపు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడమే కాకుండా..నాగార్జునసాగర్ ఉపపోరులో సత్తాచాటుతామంటున్నారు. నాగార్జునసాగర్ ఎలాంటి అభివృద్ధి జరిగిందో నిరూపించాలని బీజేపీ నేతలు సవాలు విసురుతున్నారు. సీఎం కేసీర్ సభను అడ్డుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా గంపెడాశలు పెట్టుకుంది. గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి టీఎర్ఎస్ పై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు.

పోలిటికల్ కామెంట్స్ అటుంచితే సీఎం కేసీఆర్ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీ జనసమీకరణకు టిఆర్ఎస్ ఫ్లాన్ చేసింది. తాజా రాజకీయ పరిమామాలు.. షర్మిల రాజకీయ పార్టీపై సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారో అన్న అంచనాలు జోరందుకున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story