సాగర్‌ బైపోల్, పట్టభద్రుల ఎన్నికలపై సీఎం ఫోకస్‌

Arun Chilukuri
Updated on: 28 Feb 2021 9:31 PM IST
సాగర్‌ బైపోల్, పట్టభద్రుల ఎన్నికలపై సీఎం ఫోకస్‌
X

సాగర్‌ బైపోల్, పట్టభద్రుల ఎన్నికలపై సీఎం ఫోకస్‌

త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు పట్టభద్రుల ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఫోకస్‌ పెట్టింది. దుబ్బాకలో బీజేపీ గెలుపు, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌.. పార్టీ ముఖ్యనేతలతో ప్రగతిభవన్‌లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సురభి వాణీదేవిని రంగంలోకి దింపారు. ఇక ఇదే స్థానం కోసం బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్‌ నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పోటీ పడుతున్నారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌తో పాటు టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాం, జయసారధిరెడ్డి, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి, రాణి రుద్రమదేవి పోటీపడుతున్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించారు సీఎం కేసీఆర్‌. హైదరాబాద్‌ జిల్లా ఇన్‌‍ఛార్జిగా గంగుల కమలాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జిగా హరీష్‌రావు, మహబూబ్‌నగర్‌ ఇన్‌ఛార్జిగా ప్రశాంత్‌రెడ్డిలను నియమించారు. మరోవైపు నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బాధ్యతను కూడా పలువురు మంత్రులకు అప్పగించే యోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని, ఎవరైనా అలసత్వం వహిస్తే సహించబోనని స్పష్టం చేశారు ఆయన.

ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో 71 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. ఈ రెండు స్థానాలకు మార్చి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా మార్చి 17న ఫలితాలు వెలువడనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story