టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

* లైన్ దాటితే వేటు తప్పదంటూ హెచ్చరికలు * మరో పదేళ్లు తానే సీఎం అంటూ స్పష్టం * నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో విజయం ఖాయం: సీఎం

Sandeep Eggoju
Updated on: 8 Feb 2021 10:52 AM IST
Chief Minister KCR warning to TRS MLAs
X

ఫైల్ ఇమేజ్

టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ తమ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం మార్పుపై ఎవరు గీతదాటి మాట్లాడితే బాగుండదన్నారు. తాను ఢిల్లి వెళితేనే సీఎం మార్పు ఉంటదని స్పష్టం చేసిన కేసీఆర్ ఎమ్మెల్యేలు నోరు జారితే సస్పెషన్ వేటు ఖాయమని చెప్పారు. అంతర్గత విభేదాలు పెట్టుకొని పార్టీకి నష్టం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన రెండున్నర గంటల పాటు సాగిన కార్యవర్గ సమావేశం జరిగింది. గత కొంత కాలంగా కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారానికి తాత్కాలికంగా సీఎం కేసీఆర్ పుల్ స్టాప్‌ పెట్టారు. కొందరు నేతలు ఫిబ్రవరిలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చేస్తున్న ప్రచారానికి కేసీఆర్ వ్యాఖ్యలతో చెక్ పడింది. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని మరో పదేళ్ల పాటు నేనే సీఎం అని కార్యవర్గ సభ్యులకు చెప్పారు.

అసెంబ్లీ వేదికగా ఇదే అంశాన్ని చెప్పానని ఎవరు పడితే వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళితే సీఎం మార్పు ఉంటుందని కూడా నేతలకు క్లారిటీ ఇచ్చారు. సీఎం మార్పుపై ఇకపై ఎవరూ మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు గులాబీ బాస్. దీంతో ఢిల్లీ రాజకీయాల వైపు కూడా ఇప్పట్లో కేసీఆర్ వెళ్లరు అనే సంకేతాలు స్పష్టమయ్యింది.

ఇక నాగార్జునసాగర్ బై ఎలక్షన్ పై టీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఉప ఎన్నికలు గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం అందరూ పని చేయాలని సూచించారు. అంతర్గత విభేదాలు లేకుండా ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని నేతలకు కేసీఆర్ ఆదేశించారు.

మొత్తానికి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో చాలా సేపు గడిపారు పార్టీ నేతలతో ముచ్చటించారు. పార్టీ ప్రస్థానము, పార్టీ బలోపేతము, పార్టీలో క్రమశిక్షణ, మూడు అంశాలపై ప్రధానంగా చర్చించిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తమ మార్క్ చూపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story