ఈరోజు నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

* హాలియాలో బహిరంగ సభ * సాగర్ ఉప ఎన్నిక శంఖారావం పూరించనున్న కేసీఆర్‌ * పర్యటనలో పలు ఎత్తిపోతల ప్రాజెక్టులకు శంకుస్థాపన

Sandeep Eggoju
Updated on: 10 Feb 2021 1:26 PM IST
Chief Minister KCR Tour In Nalgonda District
X

Representational Image

ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి. హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. త్వరలో సాగర్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇవాళ్టి సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు సీఎం కేసీఆర్‌.

సాగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే భావనతో.. సాగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది టీఆర్ఎస్‌. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు దాదాపు రెండు లక్షల మందిని సమీకరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. సభలో ప్రసంగించనున్న గులాబీ బాస్.. కార్యకర్తలు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఉదయం 11 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న సీఎం కేసీఆర్.. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు నందికొండకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో నెల్లికల్లుకు వెళ్లి.. 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ ఇంట్లో భోజనం చేసి.. హాలియాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.

మరోవైపు సీఎం టూర్‌ను అడ్డుకుంటామని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలోని కాషాయ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story