రేపు తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సంయుక్త సమావేశం

KCR: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి మొదలైంది. చాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

Arun Chilukuri
Published on: 20 Dec 2025 11:47 AM IST
రేపు తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సంయుక్త సమావేశం
X

KCR: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి మొదలైంది. చాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రేపు (ఆదివారం, డిసెంబర్ 21) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం 'తెలంగాణ భవన్'లో కీలక సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం (BRSLP), రాష్ట్ర కార్యవర్గం సంయుక్తంగా పాల్గొననున్నాయి. ప్రధానంగా తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం 'మరో ప్రజా ఉద్యమం' చేపట్టడంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నదీ జలాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆంధ్రప్రదేశ్ జలదోపిడీని అడ్డుకోవడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీల కేటాయింపులకు ప్రణాళికలు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం 45 టీఎంసీలకే అంగీకరించడంపై కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడి, ప్రభుత్వంపై యుద్ధ ప్రాతిపదికన చేపట్టబోయే కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్‌కు వస్తుండటంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story