Nitin Nabin: తెలంగాణలో RR టాక్స్ రాజ్యం.. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలే

Nitin Nabin: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

Arun Chilukuri
Published on: 4 Feb 2026 5:30 PM IST
Nitin Nabin: తెలంగాణలో RR టాక్స్ రాజ్యం.. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలే
X

Nitin Nabin: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 'విజయ సంకల్ప్ సమ్మేళనం'లో బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని, అభివృద్ధి పనులకు 'RR టాక్స్' కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నితిన్ నబీన్ విమర్శించారు. "రైతు భరోసా లేదు, రుణమాఫీ కాలేదు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఈ ప్రభుత్వం వంచించింది" అని ఆయన మండిపడ్డారు. ముస్లిం ఓటు బ్యాంకును దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రానికి భారీగా నిధులు మంజూరు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. "తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.5,400 కోట్లు కేటాయించాం. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లను కూడా రాష్ట్రానికి ఇచ్చాం. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది" అని ఆరోపించారు.

తెలంగాణ గడ్డ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గడ్డని, సర్దార్ పటేల్ స్ఫూర్తితో అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ రాష్ట్ర నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story