Arvind Dharmapuri: రాత్రి 11 గంటలకు ఈ గోలేంటి? మమ్మల్ని పడుకోనివ్వండి: మసీదు స్పీకర్లపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

Arvind Dharmapuri: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి వార్తల్లో నిలిచారు.
Arvind Dharmapuri: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన నివాసం సమీపంలోని మసీదు నుంచి వస్తున్న లౌడ్ స్పీకర్ల శబ్దంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఈ శబ్దానికి సంబంధించిన వీడియోను తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాత్రి 11 గంటల సమయంలో మసీదు స్పీకర్ల నుంచి భారీ శబ్దం వస్తుండటంతో అర్వింద్ మండిపడ్డారు. "రాత్రి 11 గంటల సమయంలో ఈ కర్ణభేరి పరీక్ష ఏంటి? మీకు జాగారం కావాలంటే చేసుకోండి.. కానీ మమ్మల్ని పడుకోనివ్వండి" అంటూ పోస్ట్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి వేళల్లో ఇలాంటి శబ్దాలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
రానున్న బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అర్వింద్ ఈ సమస్యను లేవనెత్తారు. మరో 15 రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఆ వెంటనే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు చదువుకోవాల్సిన ఈ కీలక సమయంలో, అర్థరాత్రి ఇలాంటి శబ్దాలు వారి ఏకాగ్రతను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే అర్వింద్ చేసిన ఈ ట్వీట్పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు విమర్శిస్తుండగా.. ఏ ప్రార్థనా మందిరమైనా సరే, ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదని, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించాలని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



