Telangana: రైతు సమస్యలపై పోరాడేందుకు బీజేపీ సన్నద్ధం

Telangana: తెలంగాణ బీజేపీ రైతు సమస్యలపై పోరాటానికి సన్నద్దమవుతోంది.

Arun Chilukuri
Updated on: 23 May 2021 12:44 PM IST
Telangana: BJP Gears up to Fight over Farmers Issues
X

బీజేపీ( ఫైల్ ఇమేజ్ )

Telangana: తెలంగాణ బీజేపీ రైతు సమస్యలపై పోరాటానికి సన్నద్దమవుతోంది. ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో ప్రభుత్వాన్ని ఏలెత్తి చూప‌డానికి క‌మ‌లం పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేలా, ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే లాక్ డౌన్ అమ‌లులో ఉన్న నేప‌థ్యంలో నిర‌స‌నను ఎలా సక్సెస్‌ చేయాలని బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీ రైతు స‌మ‌స్యలపై పోరాటం చేయ‌డానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. లాక్‌ డౌన్ కారణంగా లారీలు సరిగ్గా రావడంలేదు. కొనుగోలు కేంద్రాల ముందు ధాన్యం రాసులు పేరుకపోతున్నాయి. కొందరు రైతులయితే నెలరోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తు్న్నారు. తమ పంటను ఎప్పుడు కాంట పెడతారో అని రోజు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. ఎప్పుడు ఎటు నుంచి వాన వస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు ఇదే పరిస్థితి. రైతుల ఆరునెలల కష్టార్జితం కొనుగోలు కేంద్రాల ముందు కుప్పలుగా పోసి ఉంది. అందుకే బీజేపీ రైతుల కోసం కదం తొక్కుతుంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని డిసైడ్‌ అయ్యింది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతుందని వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ప్రభుత్వం స్పందించ‌క‌పోతే నిర‌స‌నలు చేపడతామని హెచ్చరించారు.

లాక్‌డౌన్ వేళ నిరసనలు ఎలా సాధ్యమనే అంశంపై బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఒక్క రోజు దీక్షా చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు ఎక్కడి వారు అక్కడే కోవిడ్ రూల్స్ పాటిస్తూ దీక్ష చేపట్టాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ నిరసన దీక్షను రేపే చేపట్టే అవకాశాలున్నాయి.

ఒక్క రోజు దీక్ష తర్వాత అన్ని జిల్లా కలెక్టరేట్‌ల్లో మెమరండం ఇవ్వాల‌ని కొంద‌రు నేత‌లు సూచించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు స్థానిక బీజేపీ నేతలు రైతుల వద్దకు ప‌రామ‌ర్శించి అవస‌రమైన చోట నిర‌స‌న చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ త్వరితగ‌తిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. మరీ ఈ నిర‌స‌నలతో రైతుల ఆద‌రణ‌ను క‌మ‌లం పార్టీ ఎలా దక్కించుకుంటుదనేది టన్నుల క్వశన్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story