Hyderabad: ప్రయాణికులకు షాకిచ్చిన మెట్రో...ప్రయాణంలో రాయితీ కోత..

Big Shock To  Metro Passengers
x

Hyderabad: ప్రయాణికులకు షాకిచ్చిన మెట్రో...ప్రయాణంలో రాయితీ కోత..

Highlights

Hyderabad: టాయిలెట్ల వినియోగంపై యూజర్ ఛార్జీల వసూళ్లు

Hyderabad: ప్రయాణికులకు మెట్రో మరోసారి షాక్ ఇచ్చింది.. ఇప్పటికే రాయితీల సమయాన్ని కుదించి చాలా మంది ప్రయాణికులకు రాయితీలు దూరం కాగా.. తాజాగా మెట్రో స్టేషన్ లలో ఉచితంగా ఉన్న టాయిలెట్స్ పై యూజర్ చార్జీలు విధిస్తూ మరింత భారాన్ని మోపింది.. తాజాగా మెట్రో తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి....

నగరంలో అన్ని మెట్రో స్టేషన్లలో ఇప్పటి వరకు ఉచితంగానే టాయిలెట్లను వినియోగించుకొనే సదుపాయం ఉంది. వివిధ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు మెట్రో రైల్ ప్రయాణ సదుపాయంలో భాగంగానే టాయిలెట్లను వినియోగించుకున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ L&T సంస్థ ప్రయాణికులపై యూజర్ ఛార్జిల పేరుతో భారాన్ని మోపింది.. టాయిలెట్ల వినియోగానికి 2-5 రూపాయలు వసూలు చేస్తున్నారు..మూత్రవిసర్జనకు 2, మరుగుదొడ్ల వినియోగానికి 5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ టాయిలెట్ల నిర్వహణ బాధ్యతతను సులభ్ కాంప్లెక్స్ వారికీ అప్పగించారు. ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న స్టేషన్లలో రుసుము వసూలు చేస్తుండగా.. మరో రెండు రోజుల్లో ఉప్పల్ రాయదుర్గం, జేబీఎస్- ఎంజీబీఎస్ కారిడార్లలోని అన్ని స్టేషన్లలో యూజర్ చార్జీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

ఇదివరకు మెట్రో ప్రయాణంపై పదిశాతం రాయితీతో మెట్రో కార్డుదారులకు అవకాశం కల్పించారు. ఇటీవల ఛార్జీల్లో రాయితీని ఎత్తివేశారు. ఇప్పటికే ఎలాంటి సదుపాయం లేకుండానే వాహనదారుల నుంచి అడ్డగోలుగా పార్కింగ్ చార్జీలను వసూలు చేస్తున్నారు.. గతంలో మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ ఉండగా 2 నెలల క్రితం నుండి భారీగా పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారు.. మెట్రో స్టేషన్ లో ఎలాంటి పైకప్పులు లేకపోవడంతో వాహనాలు ఎండలోనే పార్కింగ్ చేయాల్సివస్తోంది. గంటల తరబడి ఎండలోనే ఉంటున్నాయి... పార్కింగ్ ఫీజులతో పాటు మెట్రో కార్డు మీద 10 శాతం రాయితీ ఉండేది.. దానిని ఉదయం రెండు గంటలు, రాత్రి రెండు గంటలకు పరిమితం చేసారు.

మెట్రో తీసుకున్న తాజా నిర్ణయం పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మెట్రో ప్రయాణికులను యూజర్ చార్జీలు విధిస్తూ దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు...మెట్రో ఒక్కొక్కటిగా ప్రయాణికులకు దూరం చేస్తుందని, రాయితీ లు ఎత్తివేసి ఇబ్బందులు పెట్టగా ఇప్పుడు టాయిలెట్స్ కి యూజర్ చార్జీలు విధించడంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తోసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది..

మెట్రో రైలు ద్వారా ప్రయాణించే వారి సంఖ్య క్రమేణ పెరుగుతున్న నేపథ్యంలో, పార్కింగ్ ఫీజు, టాయిలెట్ల వినియోగ ఛార్జీలు వసూళ్లకు పాల్పడుతున్న తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అదనపు భారం మోపితే.. మెట్రోకు ప్రయాణికులు దూరమయ్యే అవకాశాలున్నాయని, కొత్త నిర్ణయాల అమలుపై పునరాలోచన చేయాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories