వచ్చే ఏడాది మార్చిలో వాక్సిన్ : భారత్‌ బయోటెక్

వచ్చే ఏడాది మార్చిలో వాక్సిన్ : భారత్‌ బయోటెక్
x
Highlights

భారత దేశ దిగ్గజ ఫార్మా సంస్థల్లో ఒకటైన భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు రానుందో స్పష్టమైంది. వచ్చే ఏడాది మార్చి తర్వాతే ఈ...

భారత దేశ దిగ్గజ ఫార్మా సంస్థల్లో ఒకటైన భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు రానుందో స్పష్టమైంది. వచ్చే ఏడాది మార్చి తర్వాతే ఈ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాతే, టీకా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌పైనే దృష్టి సారించినట్లు ఆ సంస్థ తెలిపింది.

వ్యాక్సిన్ సమర్థత, భద్రతకు సంబంధించి తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో కచ్చితమైన ఫలితాలు లభించి, రెగ్యులేటరీ సంస్థల అనుమతులు పొందిన తర్వాతే వ్యాక్సిన్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది 2021 రెండో త్రైమాసికంలో దీన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ICMR, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సంస్థలతో కలిసి కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాల కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి భారత్‌ బయోటెక్‌‌కు ఇటీవలే అనుమతి లభించింది. దీంతో క్లినికల్ ట్రయల్స్‌కు ఏర్పాట్లు చేస్తోంది.

ప్రస్తుతం వాలంటీర్ల ఎంపికపై భారత్ బయోటెక్ దృష్టి సారించింది. దేశంలోని 13 నుంచి 14 రాష్ట్రాల్లో సుమారు 25 నుంచి 30 ప్రాంతాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రతి హాస్పిటల్ నుంచి దాదాపు 2వేల మంది వాలంటీర్లను నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అతి త్వరలో వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయోగాల్లో భాగంగా ఒక్కో వాలంటీర్‌కు రెండు డోసుల వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు.

వ్యాక్సిన్ ప్రయోగాల కోసం భారత్ బయోటెక్ రానున్న 6 నెలల్లో దాదాపు 350 కోట్ల నుంచి 400 కోట్ల మేరకు ఖర్చు చేయనుంది. వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీకి కావాల్సిన సదుపాయాల కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ మార్కెట్లకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మార్కెట్‌ చేసే అవకాశాలపై దృష్టి సారించినట్లు తెలిపింది.

టీకా ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున, వ్యాక్సిన్ డోసు‌ ధరపై మాత్రం ఇప్పుడే తుది నిర్ణయానికి రాలేదని భారత్ బయోటెక్ తెలిపింది. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్ పైనే ఉందని స్పష్టం చేసింది. టీకాను కూడా సాధ్యమైనంత త్వరలో దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ బయోటక్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories