అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై సీఎం స్పందించాలి : బండి సంజయ్‌

Arun Chilukuri
Published on: 26 Nov 2020 10:58 AM IST
అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై సీఎం స్పందించాలి : బండి సంజయ్‌
X

గ్రేటర్‌ పోరు హీటెక్కింది. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు, సంచలన వ్యాఖ్యలు చేస్తూ పార్టీల నేతలు విరుచుకుపడుతున్నారు. పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్‌లను తొలగించాలన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో ఎంఐఎం, బీజేపీల మధ్య వివాదం మరింత ముదిరింది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్‌లను టచ్‌ చేసి చూడాలని సవాల్ విసిరారు.

ఇందులో భాగంగా.. పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్‌లను బండి సంజయ్‌ సందర్శించి నివాళులర్పించారు. ఘాట్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని అన్న సంజయ్ పీవీ, ఎన్టీఆర్‌ ఘాట్లకు బీజేపీ రక్షణగా ఉంటుందన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలు చేస్తున్న కేసీఆర్‌కు అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు వినిపించడంలేదా అని ప్రశ్నించారు. ఇష్టానుసారం మాట్లాడే వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

గ్రేటర్‌లో బీజేపీ గెలవబోతుందనే సీఎం కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు బండి సంజయ్. అందుకే గ్రేటర్ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శలు చేశారు. పీవీ, ఎన్టీఆర్‌లపై కేసీఆర్‌కు నిజమైన ప్రేమ ఉంటే అక్బరుద్దీన్‌ వ్యా‍ఖ్యలపై వెంటనే స్పందించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగేందుకు బీజేపీ సహకరిస్తుందని తెలిపారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌ను తొలగిస్తామన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు బండి సంజయ్. ఎన్టీఆర్‌ అందరికీ ఆదర్శమన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేందుకు బీజేపీ కృషి చేస్తుందని, అవసరమైతే ఏపీ బీజేపీ నేతలతో కలిసి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు బండి సంజయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story