DH Orders in Telangana: రిపోర్టుల కోసం వేధించకండి.. కరోనా లక్షణాలుంటే వెంటనే చేర్చుకోండి

DH Orders in Telangana: రిపోర్టులు ఎలా ఉన్నా.. లక్షణాలుంటే చాలు వెంటనే అడ్మిట్ చేసుకోవాలంటూ జిల్లా వైద్యాధికారులకు హెల్త్ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు.

Kranthi
Published on: 20 May 2021 7:14 AM IST
Admit them, whoever have symptoms, despite negative reports: DH Srinivasa Rao
X

DH Srinivasa Rao:(File Image)

DH Orders in Telangana: కరోనా పేషెంట్లు అడ్మిషన్ల కోసం వెళితే.. రిపోర్టు ఉందా అని అడుగుతారు. ఇప్పుడు చాలామందికి టెస్టుల్లో తేలటం లేదు. ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ లో సైతం నెగెటివ్ వచ్చి.. సీటీ స్కాన్ లో పాజిటివ్ వచ్చిన కేసులు చాలా కనపడుతున్నాయి. అలాంటి వారంతా ముందే ట్రీట్ మెంట్ కి వచ్చినా.. పాజిటివ్ లేదు కాబట్టి చేర్చుకోం అని గతంలో వెనక్కి పంపారు. అలాంటివారు సీరియస్ అయ్యాకే రిపోర్టుల్లో బయటపడటం.. ట్రీట్ మెంట్ ఇచ్చినా కాపాడుకోలేకపోవటం వంటి ఘటనలు చాలానే జరిగాయి.

తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్ధితిని గుర్తించింది. అందుకే కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. రిపోర్టులు ఎలా ఉన్నా.. లక్షణాలుంటే చాలు వెంటనే అడ్మిట్ చేసుకోవాలంటూ జిల్లా వైద్యాధికారులకు హెల్త్ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రుల్లో చేర్చుకోవడంపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఆయన సూచించారు. ఈ మేరకు శ్రీనివాసరావు అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీచేశారు. కోవిడ్‌ రిపోర్టు లేకపోయినా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో చేర్చుకోవాలని స్పష్టం చేశారు. లక్షణాలతో వచ్చే రోగులను ఎలాంటి కారణంతో తిప్పి పంపించొద్దని ఆదేశాలు జారీచేశారు.

ఆసుపత్రులకు వచ్చే రోగులకు గుర్తింపు కార్డు లేకపోయినా.. స్థానికేతరులకు చికిత్స అందించాలన్నారు. కోవిడ్‌ బాధితుల డిశ్చార్జి విషయంలోనూ కేంద్ర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కేంద్ర మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని డీఎంహెచ్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇటీవల కాలంలో తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు పలు కఠిన ఆంక్షలను, ఆదేశాలను విధిస్తూ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా శ్రీనివాసరావు ఈ ఆదేశాలను జారీ చేశారు.

Kranthi

Kranthi

Next Story