SRSP: SRSP ప్రాజెక్టుకు 60 వసంతాలు పూర్తి.. నేడు రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జలహారతి

60 Years To Sriram Sagar Project Water Will Release From Today
x

SRSP: SRSP ప్రాజెక్టుకు 60 వసంతాలు పూర్తి.. నేడు రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జలహారతి

Highlights

SRSP: ఖరీఫ్ పంటలకు నేటి నుండి సాగు నీరు విడుదల

SRSP: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 60 వసంతాల వేడుకల్లో భాగంగా ప్రాజెక్టు వద్ద రాష్ట్ర రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జలహారతి ఇవ్వనున్నారు. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద దీనికి శంకుస్థాపన చేశారు . ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు. 1978లో ప్రాజెక్టు పూర్తికాగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. 1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, సిఎం ఎన్టీఆర్ లు SRSP రెండో దశకు శంకుస్థాపన చేశారు. 2009లో కాంగ్రెస్‌ సర్కారు హయాంలో ప్రాజెక్టు పైన నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 112 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి , వరద కాల్వలను అందుబాటులోకి తెచ్చారు. 60 ఏళ్లుగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తోంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. 1983లో టీడీపీ సర్కారు హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని నిర్మాణం 1988లో పూర్తి కాగా.. ఆయనే ప్రారంభించారు.

60 వసంతాల వేడుకల్లో భాగంగా ప్రాజెక్టు వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జలహారతి ఇవ్వనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తో పాటు.. కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గానికి చెందిన నేతలు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ వద్ద పూజలు నిర్వహించనున్నారు. శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్ పంటలకు నేటి నుండి సాగు నీటిని విడుదల చేయనున్నారు. కాకతీయ కాలువ ద్వారా ఎల్‌ఎండీకి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. భారీగా కురిసిన వర్షాల వల్ల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 90వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 807 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 10వందల 91 అడుగులు కాగా, ప్రస్తుతం 10వందల 85 అడుగుల నీటిమట్టం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories