India vs England: మొదటి వన్డేలో భారత్ ఘన విజయం

Team Indian Won By 66 Runs In First ODI vs England
x

టీమిండియా (ఫొటో ట్విట్టర్)

Highlights

India vs England: పూణే లో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 66 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 తేడాతో ముందుంది.

India vs England: పూణే లో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 66 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 తేడాతో ముందుంది. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన క్రునాల్, ప్రసీధ్ద్ లతోపాటు కోహ్లీ, ధావన్, రాహుల్ మెరవడంతో టీమిండియా అన్ని రంగాల్లో మెరిసి 42.1 ఓవర్లోనే ఇంగ్లాండ్ టీం ను ఆలౌట్ చేసింది.

318 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు ఆరంభం నుంచే టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు బెయిర్‌ స్టో, జేసన్‌ రాయ్‌ వీరవిహారం చేశారు. వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు ఎంతగానో ప్రయత్నించారు. ఈ దశలో, ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(35 బంతుల్లో 46; 7 ఫోర్లు, సిక్స్‌)ని అరంగేట్రం బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ బోల్తా కొట్టించాడు. 15 ఓవర్‌ రెండో బంతికి ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ సూర్యకుమార్‌ క్యాచ్‌ పట్టడంతో రాయ్‌ పెవిలియన్‌ బాటపట్టాడు.

ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాళ్లు అదరగొట్టారు. బ్యాటింగ్‌లో కృనాల్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించగా, బౌలింగ్‌లో ప్రసిద్ధ్‌ కృష్ణ ఇరగదీశాడు. తొలుత జేసన్‌ రాయ్‌ని, ఆ తరువాత స్టోక్స్‌(11 బంతుల్లో 1)ను ఔట్‌ చేశాడు. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ శుభ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌ పట్టడంతో స్టోక్స్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 17 ఓవర్‌ వికెట్‌ మెయిడిన్‌ కావడం విశేషం. అలాగే ధనాధన్‌ బ్యాటింగ్‌తో టీమిండియా బౌలర్లను కంగారు పెట్టిన ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌ స్టో (66 బంతుల్లో 94; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఎట్టకేలకు శార్గుల్ కి చిక్కాడు. సెంచరీకి చేరువగా వెళ్లిన అతను భారీ షాట్‌ ఆడే క్రమంలో వికెట్‌ను చేజార్చుకున్నాడు. శార్ధూల్‌ బౌలింగ్‌లో కుల్దీప్‌ క్యాచ్‌ తో అతను పెవిలియన్‌ చేరాడు.

అనంతరం ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు వరుసపెట్టి పెవిలియన్‌ బాట పట్టారు. ఆ జట్టు కెప్టెన్‌ మోర్గాన్‌(30 బంతుల్లో 22; ఫోర్‌, సిక్స్‌).. శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియా పేసర్‌ శార్ధూల్‌ ఠాకూర్‌ ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను తీవ్రంగా దెబ్బతీశాడు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను భారత్‌వైపు మళ్లించాడు. 25 ఓవర్‌లో తొలుత మోర్గాన్‌ను ఔట్‌ చేసిన శార్డుల్.. ఆ తరువాత బట్లర్‌(4 బంతుల్లో 2)ను ఎల్బీడబ్యూగా ఔట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు.

మరో ఇంగ్లండ్‌ ఆటగాడు సామ్‌ బిల్లింగ్స్(22 బంతుల్లో 18; ఫోర్‌​)ను ఔట్‌ చేసి తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ప్రసీద్ధ్. అలాగే భువనేశ్వర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ క్యాచ్‌ పట్టడంతో మొయిన్‌ అలీ(37 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్‌) పెవిలియన్ చేరడంతో విజయం భారత్ వైపు చేరింది. టీమిండియా బౌలర్లు ప్రసిద్ధ్‌ కృష్ణ 4 వికెట్లు, శార్ధూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు.

అంతకుముందు..టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 317 భారీ లక్ష్యాన్ని సాధించింది. హార్ధిక్‌ సోదరుడు కృనాల్‌ పాండ్యా(31 బంతుల్లో 58; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అరంగేట్రంలోనే అదిరిపోయే అర్ధశతకంతో అలరించాడు. కృనాల్‌కు తోడుగా మరో ఎండ్‌లో రాహుల్‌(43 బంతుల్లో 62; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సైతం భారీ షాట్లతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 317 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌(42 బంతుల్లో 28; 4 ఫోర్లు), కోహ్లి(60 బంతుల్లో 56; 6 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(9 బంతుల్లో 6; ఫోర్‌), ధవన్‌(106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్‌ పాండ్యా (1) అవుటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 3, మార్క్‌ వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories