WTC Final 2021: ప్రాక్టీస్​ మొదలుపెట్టిన టీంఇండియా!

డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌) ఫైనల్‌ కోసం టీం ఇండియా గత వారం ఇంగ్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 8 Jun 2021 3:18 PM IST
Team India Cricketers Started Practice Session in Southampton Ahead of WTC Final 2021 Match
X

ప్రాక్టీస్‌ లో టీంఇండియా ఆటగాళ్లు (ఫొటో ట్విట్టర్)

WTC Final 2021: డబ్ల్యూటీసీ (వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌) ఫైనల్‌ కోసం టీం ఇండియా గత వారం ఇంగ్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. మూడు రోజుల కఠిన క్వారంటైన్ ముగియడంతో... ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా, మరో ఏడు రోజులు హోటల్ గదులకే పరిమితం కానున్నారు. ఇప్పుడిప్పుడే ఆటగాళ్లంతా మైదానంలోకి దిగి ప్రాక్టీస్‌ మొదలుపెడుతున్నారు.

ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలను ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ట్విట్టర్లో షేర్ చేశాడు. సౌతాంప్టన్ పిచ్‌పై జడేజా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీనికి 'సౌతాంప్టన్‌లో తొలి ఔటింగ్.. హ్యాపీగా ఉంది' అని క్యాప్షన్‌ ఇచ్చాడు.


సౌతాంప్టన్ వేదికగా ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్, ఇండియా టీంలు డబ్ల్యూటీసీ ఫైనల్‌ లో తలపడనున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌కు ఆరవ రోజును అనగా 23వ తేదీని రిజర్వ్‌ డేగా ఐసీసీ ప్రకటించింది. ఈ ఫైనల్ పూర్తయ్యాక 42 రోజుల విరామం దొరకనుంది టీం ఇండియా ఆటగాళ్లకు. ఈ గ్యాప్ తరువాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది టీం ఇండియా. ఆగస్టు 4న నాటింగ్‌హమ్‌లో మొదటి టెస్టు జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందుక కొన్ని వార్మప్‌ మ్యాచ్‌లూ జరగనున్నాయి.


ఇక ఈ పర్యటనలో చివరిదైన ఐదో టెస్టు సెప్టెంబర్‌ 14న జరగనుంది. కరోనా పరిస్థితులు, క్వారంటైన్ దృష్ట్యా టీం ఇండియాను ఇంగ్లాండ్‌లోనే అన్ని రోజులు ఉంచేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అందుకే శ్రీలంక పర్యటనకు రెండో జట్టును తయారు చేసింది. కాగా, శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు చాలా ఏళ్ల తరువాత రెండో టీం ను బరిలోకి దింపనుంది బీసీసీఐ. జులై లో జరిగే ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉంది. అలాగే ఈ టీంకు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల చివర్లో టీం ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.


Venkata Chari

Venkata Chari

Next Story