కరోనా బారిన మ‌రో భార‌త‌ క్రికెట‌ర్..టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కు డౌటే

Prasidh Krishna: టీమిండియాకు మ‌రో షాక్ త‌గిలింది. భార‌త జట్టు యువ‌ బౌల‌ర్ క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయింది.

Samba Siva Rao
Updated on: 8 May 2021 7:15 PM IST
Prasidh Krishna tests Covid Positive
X

 ప్రసిద్ధ్ కృష్ణ(సోర్స్: cricinfo )

Prasidh Krishna: టీమిండియాకు మ‌రో షాక్ త‌గిలింది. భార‌త జట్టు యువ‌ బౌల‌ర్ క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయింది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇంగ్లండ్ లో జరిగే ఐసీసీ ప్ర‌పంచ‌ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు స్టాండ్ బైగా ఎంపికైన ప్రసిద్ధ్ కృష్ణ (25) కరోనా బారినపడ్డాడు. ఈ పొడగరి ఫాస్ట్ బౌలర్ కు కరోనా సోకడంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో కరోనా పాజిటివ్ ఆటగాళ్ల సంఖ్య నాలుగుకి పెరిగింది.

ఇంతకుముందు కోల్ కతా నైట్ రైడర్స్ ఆట‌గాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, టిమ్ సీఫెర్ట్ లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ అర్థాంతరంగా ముగియడంతో ప్రసిద్ధ్ కృష్ణ మే 3న ఐపీఎల్ బబుల్ ను వీడి స్వస్థలం బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరులో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. వరుణ్ చక్రవర్తికి ప్రసిద్ధ్ కృష్ణ ఎంతో సన్నిహితుడని, వరుణ్ చక్రవర్తి నుంచి సందీప్ వారియర్ కు, ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా సోకిందని బీసీసీఐ వర్గాలు వివరించాయి.

ఇక, ఇంగ్లండ్ వెళ్లే టీమిండియా ఆటగాళ్లకు మే 25 నుంచి బయోబబుల్ ఏర్పాటు చేస్తుండగా, ఆ సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ కోలుకుంటాడని బీసీసీఐ ఆశాభావంతో ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ ప్రస్తుతం తన స్వస్థలం బెంగళూరులోనే హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో -భారత జట్టు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ ఆడ‌నున్న సంగ‌తి తెలిసిందే.జూన్‌ 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ జరగనుంది. విరాట్ కోహ్లి కెప్టెన్‌గా.. అజింక్య రహానే వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ముగిసిన తర్వాత భార‌త్- ఇంగ్లండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ సిరీస్‌ జరగనుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story