T20 World Cup 2026: పీసీబీ నుంచి కీలక సమాచారం లీక్.. అనిశ్చితికి తెర, మరి భారత్ మ్యాచ్ సంగతేంటి?

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026కు సమయం ఆసన్నమైంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది.

Rishvik
Published on: 29 Jan 2026 9:18 PM IST
T20 World Cup 2026
X

T20 World Cup 2026: పీసీబీ నుంచి కీలక సమాచారం లీక్.. అనిశ్చితికి తెర, మరి భారత్ మ్యాచ్ సంగతేంటి?

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026కు సమయం ఆసన్నమైంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకుంది. శ్రీలంకలో తమ మ్యాచ్‌లు నిర్వహించాలని బంగ్లా కోరగా.. అందుకు ఐసీసీ ఒప్పుకోలేదు. బంగ్లాకు మద్దతుగా తాము సైతం టీ20 వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ బెదిరించింది. మెగా టోర్నీలో తప్పక ఆడాల్సిందే అని, లేదా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. బీరాలకు పోయిన పాక్‌ దారిలోకి వచ్చింది. మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంకకు పయనం కాబోతోంది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి కీలక సమాచారం బయటికి వచ్చింది. ప్రముఖ క్రికెట్ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనాలా వద్దా అనే తుది నిర్ణయం ఇప్పుడు ప్రధాని చేతుల్లోనే ఉందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ స్పష్టంగా తెలియజేశారట. ఇస్లామాబాద్‌లో ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌తో నక్వీ సమావేశమైనట్లు సమాచారం. ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదమున్న కారణంగా.. వరల్డ్‌కప్‌లో పాల్గొనాలని ప్రధాని నక్వీతో చెప్పారట. దీంతో పాక్ జట్టు వరల్డ్‌కప్ పాల్గొనడంపై ఇన్నిరోజులు కొనసాగిన అనిశ్చితి తొలిగిపోయినట్లే.

ఇప్పటికే పాకిస్థాన్ జట్టు లాజిస్టిక్స్ పరంగా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ పూర్తయ్యాక.. పాకిస్థాన్ జట్టు నేరుగా శ్రీలంకలోని కొలంబోకు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పాక్ ఆటగాళ్లందరికీ ఇప్పటికే ట్రావెల్ టికెట్లు కూడా అందినట్లు సమాచారం. మ్యాచ్ షెడ్యూల్ విషయానికి వస్తే.. పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో ఆడనుంది. రెండో మ్యాచ్‌ను ఫిబ్రవరి 10న అమెరికాతో ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల అనంతరం మాత్రమే భారత జట్టుతో జరిగే మ్యాచ్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. అవసరమైతే ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలని చేస్తోందట. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ పూర్తి స్థాయిలో పాల్గొంటుందా?, ఇండియాతో మ్యాచ్ ఆడుతుందా లేదా? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే.. కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. వరల్డ్‌ కప్‌లో పాక్‌ పాల్గొనే అంశంపై శుక్రవారం అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది.

Rishvik

Rishvik

Next Story