
Smriti Mandhana : పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత స్మృతి మంధాన పోస్ట్ వైరల్
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఈ రోజుల్లో తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచింది. ఆదివారం ఆమె తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది
Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఈ రోజుల్లో తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచింది. ఆదివారం ఆమె తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన విడుదలైన కొద్ది గంటల్లోనే సోమవారం స్మృతి ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రాండెడ్ పోస్ట్ షేర్ చేసింది. దానికి For me, calm isn't silence - it's control(నాకు, ప్రశాంతత అంటే నిశ్శబ్దం కాదు, అది నియంత్రణ) అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కేవలం ఎనిమిది గంటల్లోనే 4 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి.
గత కొద్ది వారాలుగా సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్, స్మృతి మంధాన వివాహం గురించి రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. మొదట వారి పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉండగా, స్మృతి తండ్రికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వేడుక వాయిదా పడింది. ఆ తర్వాత పుకార్లు మరింత పెరిగాయి. దీనిపై స్పందించిన స్మృతి, ఆదివారం రోజు ఒక పోస్ట్ చేస్తూ.. "నా వివాహం రద్దు అయింది అని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ విషయం ఇక్కడితో ముగియాలని కోరుకుంటున్నాను" అని తెలిపింది. తాను ఎప్పుడూ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచాలనుకునే వ్యక్తిగా ఉన్నానని, కానీ నిరంతర పుకార్ల కారణంగానే ముందుకు రావాల్సి వచ్చిందని వివరించింది.
స్మృతి మంధాన తన అభిమానులకు, సమాజానికి ఒక విజ్ఞప్తి చేసింది. "దయచేసి రెండు కుటుంబాల గోప్యతను గౌరవించి, మేము ముందుకు సాగడానికి అవకాశం ఇవ్వండి" అని ఆమె కోరింది. స్మృతి పోస్ట్ చేసిన కొద్దిసేపటికే పలాష్ ముచ్ఛల్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ షేర్ చేస్తూ తన వైపు నుంచి ప్రకటన చేశారు. గత కొన్ని వారాలు తనకు చాలా కష్టంగా గడిచాయని, పుకార్లపై ప్రజలు అంత సులభంగా స్పందించడం తనకు చాలా ఇబ్బందిగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా తప్పుదోవ పట్టించే విషయాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పలాష్ హెచ్చరించారు.
24 ఏళ్ల స్మృతి మంధాన ఇప్పుడు మళ్లీ ఆటపై దృష్టి సారించింది. డిసెంబర్ 21 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టీ20I సిరీస్ కోసం ఆమె సన్నాహాలు మొదలుపెట్టింది. "భారతదేశం తరఫున ఆడటం, జట్టును గెలిపించడమే నా పూర్తి లక్ష్యం. ఇదే ఎప్పుడూ నా ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుంది" అని ఆమె తన ప్రకటనలో స్పష్టం చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




