దక్షిణాఫ్రికాలో తొలిసారి ఆడనున్న ఏడుగురు భారతీయులు.. గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

India vs South Africa 2021: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది...

Shireesha
Updated on: 24 Dec 2021 3:00 PM IST
Seven Indian Cricketers who will make Their Debut Match on South Africa
X

దక్షిణాఫ్రికాలో తొలిసారి ఆడనున్న ఏడుగురు భారతీయులు.. గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

India vs South Africa 2021: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 26న భారత్-దక్షిణాఫ్రికా జట్లు సెంచూరియన్ మైదానంలో మ్యాచ్ కోసం బరిలోకి దిగనున్నాయి. ఇరు జట్ల సన్నాహాలు చివరి దశలోకి చేరుకున్నాయి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టు దక్షిణాఫ్రికా చేరుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడం లేదు.

అయితే ఒక్క ఆటగాడికి కరోనా సోకినా, సిరీస్‌ను కొనసాగించాలంటూ ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో ఆడనున్న ఏడుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లలో చాలా మంది ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ ఆటగాళ్లందరి ప్రదర్శన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మూడు టెస్టుల సిరీస్‌లో వారి ప్రదర్శన ఈ అంకెలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

ఆ ఏడుగురు ఎవరంటే?

మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హనుమ విహారి, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్ ఈ జాబితాలో ఉన్నారు. ప్రియాంక్ పాంచల్ కూడా మొదటిసారిగా భారత జట్టుతో సౌతాఫ్రికా టూర్‌లో భాగమయ్యాడు. అయితే ప్రియాంక్ పాంచల్ ఇటీవల దక్షిణాఫ్రికాలో అనధికారిక టెస్ట్ మ్యాచులు ఆడినందున ప్రస్తుతానికి అతడి గణంకాలను లెక్కించడం లేదు. మొత్తం ఏడుగురు ఆటగాళ్లలో, నలుగురు లేదా ఐదుగురు ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్‌లో మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇప్పటికే ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమయ్యారు.

బౌలింగ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ ఆడడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. శార్దూల్ ఠాకూర్, హనుమ విహారి కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోసం పోటీదారులుగా నిలిచారు. టీమ్ ఇండియా రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఈ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దక్షిణాఫ్రికా పిచ్‌ల మూడ్‌ని అర్థం చేసుకుంటే భారత బ్యాట్స్‌మెన్‌కు పెద్ద సవాల్‌ ఎదురుకానుందని అంతా భావిస్తున్నారు.

ఈ ఏడుగురు భారతీయుల రికార్డులు ఎలా ఉన్నాయంటే?

మయాంక్ అగర్వాల్ 16 టెస్టు మ్యాచ్‌ల్లో 47.92 సగటుతో 1294 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రిషబ్ పంత్ 25 టెస్టుల్లో 39.71 సగటుతో 1549 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

శ్రేయాస్ అయ్యర్ 2 టెస్టుల్లో 202 పరుగులు చేశాడు. 50.50 సగటుతో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాధించాడు.

ఇక బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ 10 టెస్టుల్లో 33 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

శార్దూల్ ఠాకూర్ 4 టెస్టుల్లో 14 వికెట్లు తీసి, దక్షిణాఫ్రికాల సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.

హనుమ విహారి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోసం తన బ్యాటింగ్ గణాంకాలతో సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు 12 టెస్టు మ్యాచ్‌లు ఆడిన మన తెలుగబ్బాయి 624 పరుగులు సాధించాడు. విహారి ఖాతాలో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

అలాగే చాలా కాలం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన జయంత్ యాదవ్ 5 టెస్టు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు.

ఈ గణాంకాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది టెస్ట్ క్రికెట్‌లో వీరి సామర్థ్యాలను చూపిస్తుంది. ఈ గణాంకాలను మరింత మెరుగుపరచడం వీరికి సవాలుగా మారింది. దీని కోసం దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ వీరికి సరైన వేదికగా మారనుంది.

Shireesha

Shireesha

Next Story