MS Dhoni CSK: మిస్టర్ కూల్‌కి రూ.12 లక్షల జరిమానా.. ఎందుకో తెలుసా..?

IPL 2021: తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 11 April 2021 3:38 PM IST
Chennai Super Kings MS Dhoni Fined Rs 12 Lakh For Slow Over-Rate
X

చెన్నై కెప్టెన్ ధోనీకి రూ. 12 లక్షల జరిమానా

MS Dhoni CSK: తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. ఐపీఎల్ 2021లో మొదటి మ్యాచ్ లోనే ఊహించని విధంగా షాక్ తగిలింది. అలాగే మ్యాచ్ ముగిసిన తరువాత మిస్టర్ కూల్ కి మరో షాక్ తగిలింది. చెన్సై కెప్టెన్ కి రూ.12 లక్షల జరిమానా పడింది.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ ఓపెనర్లు శిఖర్ ధావన్ (85: 54 బంతుల్లో 10x4, 2x6), పృథ్వీ షా (72:38 బంతుల్లో 9x4, 3x6) చెన్నై బౌలర్లను ఉతికి ఆరేయడంతో.. ఢిల్లీ టీమ్ 18.4 ఓవర్లలోనే 190/3తో గెలుపొందింది. ఓపెనింగ్ జోడీని విడగొట్టేందుకు ఓవర్ మధ్యలో బౌలర్లతో చర్చలు, ఫీల్డింగ్ కూర్పుపై కెప్టెన్ ఎక్కువ టైంను కేటాయించాడు. దీంతో కెప్టెన్ పై జరిమానా పడింది.

కేటాయించిన టైంలోపే ఓవర్లను పూర్తి చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల కొన్ని నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం టీ20ల్లో 20 ఓవర్లని 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన గంటకి కనీసం 14.1 ఓవర్లు వేయాలి. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా విఫలమైంది. దాంతో.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి రూ.12 లక్షలు జరిమానా పడింది. మొదటి తప్పిదం కాబట్టి.. రూ.12 లక్షలతో సరిపెట్టారు. టోర్నీలో రిపీట్ అయితే జరిమానా రెట్టింపయ్యే అవకాశం ఉంది. మూడో సారి రిపీట్ అయితే ధోనిపై ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం కూడా పడోచ్చు.

Venkata Chari

Venkata Chari

Next Story