Gautam Gambhir: ఓవల్ టెస్టుకు ముందు రచ్చ.. గంభీర్, క్యూరేటర్ మధ్య గొడవ

Gautam Gambhir: భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌కి రెండు రోజుల ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఒక వింత సంఘటన జరిగింది.

CR Reddy
Published on: 30 July 2025 7:45 AM IST
Gautam Gambhir
X

Gautam Gambhir: ఓవల్ టెస్టుకు ముందు రచ్చ.. గంభీర్, క్యూరేటర్ మధ్య గొడవ

Gautam Gambhir: భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌కి రెండు రోజుల ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఒక వింత సంఘటన జరిగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ గ్రౌండ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. అసలు ఈ గొడవ ఎందుకు జరిగిందనే దానిపై భారత బ్యాటింగ్ కోచ్ కొటక్ కీలక విషయాలు బయటపెట్టారు. అంతేకాదు, ఒక పాత ఫోటో ఆ క్యూరేటర్ తీరును పూర్తిగా బయటపెట్టింది.

గంభీర్, క్యూరేటర్ మధ్య గొడవ అప్పుడు మొదలైంది. క్యూరేటర్ ఫోర్టిస్, భారత టీమ్ సపోర్ట్ స్టాఫ్‌ను పిచ్‌కు 2.5 మీటర్ల దూరంలో నిలబడమని, తాడు బయట నుంచే పిచ్‌ను చూడాలని చెప్పాడు. దీనిపై గంభీర్ ఆ గ్రౌండ్ స్టాఫ్ వైపు వేలు చూపిస్తూ, "నువ్వు ఎవరు మాకు ఏమి చేయాలో చెప్పడానికి ? నువ్వు కేవలం ఒక గ్రౌండ్స్‌మెన్వి, అంతకు మించి ఏమీ కాదు" అని అన్నాడు. నిజానికి, టీమ్ స్టాఫ్ పిచ్ దగ్గరికి వెళ్లకూడదని ఎక్కడా నిబంధనలు లేవు. మ్యాచ్‌కు ముందు కెప్టెన్, టీమ్ స్టాఫ్‌కు పిచ్‌ను చూసే అవకాశం పూర్తిగా ఉంటుంది.

ఈ సంఘటనపై భారత బ్యాటింగ్ కోచ్ కొటక్ మాట్లాడుతూ.. "మేము పిచ్‌ను పరిశీలిస్తున్నప్పుడు, ఒక గ్రౌండ్ స్టాఫ్ వచ్చి పిచ్ నుండి 2.5 మీటర్ల దూరంలో నిలబడాలని, తాడు బయటి నుంచే పిచ్‌ను చూడాలని చెప్పాడు. భారత జట్టు సభ్యులు స్పైక్‌లు ధరించలేదు, కాబట్టి పిచ్‌కు ఎటువంటి ప్రమాదం లేదు. ఇలాంటి పరిస్థితిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు" అని అన్నారు.

కొటక్ చెప్పిన దాని ప్రకారం.. ఫోర్టిస్ భారత టీమ్ సపోర్ట్ స్టాఫ్ సభ్యుడిపై అరుస్తూ, కూలింగ్ బాక్స్‌ను మెయిన్ స్క్వేర్ దగ్గరకు తీసుకెళ్లవద్దని అన్నాడు. సపోర్ట్ స్టాఫ్ ఒకరు కూలింగ్ బాక్స్‌ను అక్కడికి తీసుకువస్తున్నప్పుడు కూడా ఫోర్టిస్ రోలర్‌పై కూర్చుని ఉన్నాడు. అతను సపోర్ట్ స్టాఫ్‌తో అరుస్తూ దాన్ని అక్కడికి తీసుకురావద్దని చెప్పాడు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌తో అలా మాట్లాడకు అని అన్నాడు. అయితే, ఫోర్టిస్ గంభీర్‌తో అనడంతో ఎవరికి చెప్పుకుంటావో చెపుకో అని బదులిచ్చాడు.

ఇంగ్లండ్ జట్టు సోమవారం ప్రాక్టీస్ చేయలేదు. కానీ, హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పిచ్‌ను చూడటానికి వచ్చారు. ఈ సమయంలో బ్రెండన్ మెకల్లమ్‌కు పిచ్‌ను చాలా దగ్గరగా చూసే అవకాశం లభించింది. ఇది మరింత చర్చకు దారితీసింది. అంతేకాకుండా, బ్రెండన్ మెకల్లమ్, ఫోర్టిస్ పాత వీడియో ఒకటి కూడా వైరల్ అవుతోంది. ఇది 2023 యాషెస్ సిరీస్‌కు సంబంధించిన ఫోటో. అప్పుడు బ్రెండన్ మెకల్లమ్, ఫోర్టిస్ మ్యాచ్‌కు 48 గంటల ముందు పిచ్ మధ్యలో నిలబడి కనిపించారు. ఇంగ్లండ్ జట్టుకు ఒకరకమైన నిబంధనలు, భారత జట్టుకు వేరొక రకమైన నిబంధనలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

CR Reddy

CR Reddy

Next Story