Online Gaming : ఆన్‌లైన్ గేమింగ్ బ్యాన్‌తో క్రికెటర్లకు భారీ షాక్.. కోహ్లీ, రోహిత్‌లకు కోట్లలో నష్టం

Online Gaming : ఆన్‌లైన్ గేమింగ్ బ్యాన్‌తో క్రికెటర్లకు భారీ షాక్.. కోహ్లీ, రోహిత్‌లకు కోట్లలో నష్టం

Arun Chilukuri
Updated on: 27 Aug 2025 3:00 PM IST
Kohli, Rohit to Lose Crores Impact of New Gaming Bill
X

Online Gaming : ఆన్‌లైన్ గేమింగ్ బ్యాన్‌తో క్రికెటర్లకు భారీ షాక్.. కోహ్లీ, రోహిత్‌లకు కోట్లలో నష్టం

Online Gaming : భారతదేశంలో ఇటీవల ఆమోదించిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 క్రికెట్ ప్రపంచంలో కలకలం సృష్టించింది. ఈ బిల్లు రియల్ మనీ గేమింగ్ పై పూర్తిగా నిషేధం విధించింది. ఇందులో ఫాంటసీ క్రికెట్, రమ్మీ, పోకర్ వంటి ఆటలు కూడా ఉన్నాయి. ఈ చట్టం కేవలం గేమింగ్ ఇండస్ట్రీ పైనే కాకుండా, భారత క్రికెట్, ఆటగాళ్లు, స్పాన్సర్‌షిప్‌లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ బిల్లు వల్ల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజాలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని నివేదికలు చెబుతున్నాయి.

భారత క్రికెటర్లకు కోట్ల నష్టం

2025 ఆగస్టు 21న భారత పార్లమెంట్ ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించే బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు రియల్ మనీతో కూడిన ఆన్‌లైన్ గేమ్‌లను ఆడటం లేదా నిర్వహించడాన్ని నిషేధిస్తుంది. ఈ చట్టం ప్రకారం, దీనిని ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 1-2 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. అంతేకాకుండా, ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌ల ప్రచారం ప్రకటనలపై కూడా నిషేధం విధించబడింది.

చాలామంది భారత క్రికెటర్లు ఈ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉన్నారు. ఈ బిల్లు తర్వాత వారి ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్, కృనాల్ పాండ్య వంటివారు డ్రీమ్11తో అనుబంధం కలిగి ఉన్నారు. అలాగే, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సౌరవ్ గంగూలీ My11 Circleను ప్రచారం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఎంపిఎల్‌ను, ఎంఎస్ ధోనీ WinZOను ప్రచారం చేశారు.

క్రికెట్‌బజ్ నివేదిక ప్రకారం, విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్ సంవత్సరానికి రూ. 10-12 కోట్ల వరకు ఉండగా, రోహిత్ శర్మ, ధోనీకి రూ. 6-7 కోట్లు లభించేవి. యువ ఆటగాళ్ల కోసం ఈ మొత్తం దాదాపు రూ.కోటి వరకు ఉండేది. మొత్తం మీద, ఈ బిల్లు కారణంగా భారత క్రికెటర్లకు ప్రతి సంవత్సరం రూ. 150-200 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

బీసీసీఐకి కూడా గట్టి ఎదురుదెబ్బ

ఇప్పటివరకు ఐపీఎల్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) రియల్ మనీ గేమింగ్ కంపెనీల నుండి వచ్చే స్పాన్సర్‌షిప్‌లపై ఎక్కువగా ఆధారపడింది. డ్రీమ్11 భారత జట్టు కోసం రూ. 358 కోట్లు, My11Circle ఐపీఎల్ కోసం రూ. 625 కోట్ల స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ బిల్లు అమలులోకి రావడంతో ఈ ఒప్పందాలు ప్రమాదంలో పడవచ్చు. దీనివల్ల క్రికెట్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story