IPL 2020: చెల‌రేగిన కోహ్లీ.. ధోనీసేన‌పై బెంగుళూర్ ఘన విజయం.

IPL 2020: చెల‌రేగిన కోహ్లీ..   ధోనీసేన‌పై  బెంగుళూర్ ఘన విజయం.
x

చెల‌రేగిన కోహ్లీ.. ధోనీసేన‌పై బెంగుళూర్ ఘన విజయం.

Highlights

IPL 2020: ఐపీఎల్ 2020 లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూర్, చెన్నై సూప‌ర్ కింగ్ మ‌ధ్య ఉత్కంఠ పోరు సాగుతుందని క్రికెట్ అభిమానులు ఊహించారు. కానీ అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయింది.

IPL 2020: ఐపీఎల్ 2020 లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూర్, చెన్నై సూప‌ర్ కింగ్ మ‌ధ్య ఉత్కంఠ పోరు సాగుతుందని క్రికెట్ అభిమానులు ఊహించారు. కానీ అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయింది. శనివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమిండియా కెప్టెన్‌, మాజీ కెప్టెన్ ల మ‌ధ్య సాగిన పోరులో టీమిండియా కెప్టెనే పై చేయి సాధించాడు. కెప్టెన్ కోహ్లీ ప్ర‌తినిథ్యం వ‌హిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుత‌మైన ఆట‌తీరుతో విరాట్ కోహ్లీ త‌న అభిమానుల‌కు అల‌రించాడు. 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 90 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీం మంచి స్కోరును అందించాడు.

టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ వ‌చ్చిన బెంగుళూరు. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ ల‌తో 33 ప‌రుగులు చేసి ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ మాత్రం కేవ‌లం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కోహ్లీ.. దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి ఆట‌ను ముందుకు సాగించారు. అనంతరం.. దేవ్‌దూత్ ఔట్ అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన ఏబి డివిలియర్స్ అనుకున్న స్థాయిలో ఆక‌ట్టుకోలేక పోయాడు. కేవ‌లం రెండు బంతులకే ఔట్ అయ్యాడు. డివిలియర్స్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ సైతం అభిమానుల‌ను నిరాశ ప‌రిచాడు 10 పరుగులే చేసి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 93 పరుగులే. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన శివం దూబేతో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. శివం దూబే 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 22 పరుగులు చేశాడు.

బెంగళూరు నిర్ణ‌యించిన 170 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఆటగాళ్లలో ఆరంభంలోనే ఓపెనర్స్ షేన్ వాట్సన్, డుప్లెసిస్ తడబడ్డారు. వాట్సన్ 18 బంతుల్లో 3 ఫోర్లు ( 14 పరుగులు చేయ‌గా.. డుప్లెసిస్ 10 బంతుల్లో కేవ‌లం 8 ప‌రుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. డుప్లెసిస్ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అంబటి రాయుడు త‌న‌దైన ఆట‌తీరుతో అభిమానులను అల‌రించాడు. చివరి వరకు ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.40 బంతుల్లో 4 ఫోర్లు తో 42 పరుగులు చేశాడు. కానీ 17వ ఓవర్‌లో ఉడన వేసిన 3వ బంతికి ఔట్ అయ్యాడు.

అంతకంటే ముందుగా 4వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన నారాయణ్ జగదీశన్ 28 బంతుల్లో 4 ఫోర్లతో 33 ప‌రుగులు చేసి... రాయుడికి అండగా నిలుస్తూ జట్టు స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ 14 ఓవర్‌లో నారాయణ్‌ని క్రిస్ మోరిస్ రనౌట్ చేయడంతో అతడి ప్రయత్నాలకి బ్రేక్ ప‌డింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన వారిలో మహేంద్ర సింగ్ ధోనీ 10 పరుగులు చేయగా ఇక మిగతా ఆటగాళ్లంతా అంతకంటే తక్కువ స్కోర్‌తోనే సరిపెట్టుకుని సింగిల్ డిజిట్స్‌కే పెవిలియన్‌కి చేరారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 132 పరుగులే చేసింది. దీంతో ధోనీ సేనకు మరో ఓటమి తప్పలేదు.

మొత్తం ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో ధోనీ సేనకు పాయింట్స్ పరంగా మరిన్ని కష్టాలు తప్పడం లేదు. కాగా ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories