Sanju Samson: టీమిండియాలో జీరో టు హీరో.. పనికిరాడన్నోడే టోర్నమెంట్ టాప్ ప్లేయర్

Sanju Samson: టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. సంజూ శామ్సన్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో రికార్డు సృష్టించారు.

KVD Varma
Published on: 9 March 2026 7:13 AM IST
Sanju Samson: టీ20 ప్రపంచ కప్ టోర్నీలో సంజూ శామ్సన్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో రికార్డు సృష్టించారు.
X

Sanju Samson

Sanju Samson: సంజు సామ్సన్ … సామర్థ్యం, ​​దృఢ సంకల్పం.. ఓపికతో వేచి ఉండడం.. ఇలాంటి విజేతలకు ఉండే ఎన్నో లక్షణాలతో కలగలిపిన క్రికెట్ హీరో. పట్టుదలతో అవకాశాల కోసం వేచి ఉండడం.. వచ్చిన అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించగలగడం ఈ లక్షణాలు ఉన్న ఎవరైనా ఏదైనా సాధించగలరనడానికి సంజూ ఒక చక్కని ఉదాహరణ. T20 ప్రపంచ కప్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా తన స్థానాన్ని సంపాదించుకున్న సామ్సన్, న్యూజిలాండ్‌తో జరిగిన T20 సిరీస్‌లో తన పేలవమైన ప్రదర్శన ఫలితంగా T20 ప్రపంచ కప్ జట్టులో అతని ఎంపికపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వరల్డ్ కప్ టీమ్ లో ఉన్నాడు కానీ, ఆడే అవకాశం రాలేదు. అసలు ఈ టోర్నీలో సామ్సన్ ను ఆడిస్తారా? అనే అనుమానమే అందరిలోనూ వచ్చింది. ఇన్ని అవమానాలన్నీ ఉన్నప్పటికీ, సంజు సామ్సన్ కు అత్యంత కీలకమైన మ్యాచ్.. చావో రేవో తేల్చుకోవాల్సిన క్లిష్ట సమయంలో బరిలోకి దిగే అవకాశం దొరికింది. ఇక అంతే.. పెదవి విరిచిన వాళ్ళే ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేలా కసిగా ఆడేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు ఆడి టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన హీరో అయిపోయాడు. దీంతో సంజు సామ్సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలిచాడు.

లీగ్ దశలో..

Sanju Samson: టీ20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో సంజు సామ్సన్‌కు ఆడే అవకాశం రాలేదు. కానీ రెండో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురికావడంతో సంజుకు ఆడే అవకాశం లభించింది. నమీబియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 22 పరుగులు చేసిన సంజుకు తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శన, రింకు సింగ్ తండ్రి మరణం తర్వాత సంజు జట్టులో ఆడే అవకాశం పొంది చరిత్ర సృష్టించాడు.

హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ

జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో 24 పరుగులు చేసిన సంజు, తర్వాతి మూడు కీలక మ్యాచ్‌లలో భారత విజయానికి హీరోగా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన సంజు, ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు నాటౌట్‌గా నిలిచి 97 పరుగులు చేసి జట్టును సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. తరువాత, సెమీఫైనల్స్‌లో కూడా ఆకట్టుకున్న సంజు, ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 89 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు, న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సంజు బ్యాట్‌తో 89 పరుగులు చేశాడు.

సామ్సన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్..

ఈ ప్రపంచ కప్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సంజు సామ్సన్, 80.2 సగటుతో 321 పరుగులు చేయడం ద్వారా, ఒకే టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడిగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచ కప్‌లో కూడా సామ్సన్ 24 సిక్సర్లు కొట్టాడు. నాలుగు మ్యాచ్‌ల్లో మొదటి ఓవర్‌లోనే సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డును కూడా సృష్టించాడు.

Sanju Samson: జీరో నుంచి హీరో అవడం అంటే మామూలు విషయం కాదు.. అందులోనూ ప్రపంచ కప్ లాంటి ముఖ్యమైన టోర్నీలో. అవకాశం ఇవ్వడానికే ఆలోచించిన టీమ్ మేనేజిమెంట్.. ఏమాడతాడో ఏమో అని అనుకున్న క్రికెట్ అభిమానులకు అందరికీ ఇప్పుడు హీరో సంజు సామ్సన్.

KVD Varma

KVD Varma

Next Story