WTC Final: ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కి షాకిస్తున్న కివీస్

WTC Final: టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు ఇంగ్లాండ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 13 Jun 2021 9:00 PM IST
India vs Newzealand in ICC Events Story
X

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (ఫొటో ట్విట్టర్)

WTC Final: టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు ఇంగ్లాండ్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు మరో ఐదు రోజులే సమయముంది. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఎవరు గెలుస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రెండేళ్లుగా సాగుతున్న ఈ సుదీర్ఘ టోర్నీలో టీమిండియా.. న్యూజిలాండ్‌ మినహా అన్ని జట్లపైనా విజయం సాధించి తుదిపోరుకు సిద్ధమైంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తోనే డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడుతుండడం గమనార్హం. ఇక పాత రికార్డులను గమనిస్తే.. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌ టీం పలుమార్లు ఇండియాకు షాకిచ్చింది. దీంతో కివీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఎలా రాణిస్తోందోనని ఆందోళనకు గురిచేస్తోంది.

2000లో ఐసీసీ నాకౌట్ సిరీస్‌లో నూ భారత్‌ను కివీస్ ఓడిచింది. ఆ తరువాత 2016లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో లీగ్‌ దశలో ఇండియా, న్యూజిలాండ్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు షాకిచ్చింది కివీస్‌. అనంతరం 2019లోనూ మరోసారి ఐసీసీ 2019 ప్రపంచ కప్‌ సెమీస్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌ విజయం సాధించి.. మరోసారి భారత్‌పై తమ గెలుపు రికార్డును పదిలం చేసుకుంది.

ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో న్యూజిలాండ్‌తో ఇండియా రెండు టెస్టుల్లో తలపడింది. తొలి టెస్టులో న్యూజిలాండ్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌ ఎప్పుడూ భారత్‌కు చేదు అనుభవమే మిగిలిస్తోంది. ఇప్పుడు ఫైనల్‌ మ్యాచ్‌ ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో తటస్థ వేదికగా జరుగుతుండడంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరుగుతోంది. కానీ, ఆ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌.. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడటం వల్ల ఆ జట్టుకు కలిసివస్తుందని పలువురు క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీసేన ఎలా ఆడనుందో వేచిచూడాలి.

Venkata Chari

Venkata Chari

Next Story