ఆరాటం వర్సెస్ పోరాటం.. టీమిండియాను వేధిస్తున్న సమస్య ఏంటి ?

Arun Chilukuri
Updated on: 28 Nov 2020 9:30 PM IST
ఆరాటం వర్సెస్ పోరాటం.. టీమిండియాను వేధిస్తున్న సమస్య ఏంటి ?
X

సిరీస్ సమయం చేయాలన్న పోరాటం వీళ్లది.. ఈ ఒక్కటి గెలిచి ట్రోఫీ ఎగరేయాలన్న ఆరాటం వాళ్లది ! ఆస్ట్రేలియా, ఇండియా రెండో వన్డే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ ఇండియా పాజిటివ్స్ , నెగిటివ్స్ ఏంటి ఎలాంటి మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయ్ ?

ఆస్ట్రేలియా పర్యటనను భారీ పరాజయంతో ఆరంభించింది టీమిండియా. దీంతో సిరీస్ విజయంపై ఆశలు సజీవంగా ఉండాలంటే ఆదివారం జరగాల్సిన వన్డేలో విరాట్ సేన తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఐతే మొదటి వన్డే ఓటమి తర్వాత భారత్‌లోపాలు ఒక్కసారిగా బయటపడ్డాయ్. హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో అదరగొట్టినా బౌలింగ్‌కు దూరం కావడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఆరో బౌలర్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

మొదటి వన్డేలో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. షమీ మినహా ఎవరూ సరిగా రాణించలేకపోయరు. తొలి మ్యాచ్‌లో సైని, చాహల్‌ కలిసి 20ఓవర్లలో 172 పరుగులు ఇచ్చారు. ఐతే చాహల్ తన స్పెల్ ముగిసిన తర్వాత గాయంతో మైదానాన్ని వీడాడు. సైని వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. వారిద్దరు రెండో మ్యాచ్‌కు ఫిట్‌నెస్‌ సాధించకపోతే శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్ యాదవ్ జట్టులోకి రానున్నారు. మరో పేసర్ నటరాజన్‌ జట్టులో ఉన్నప్పటికీ బ్యాటింగ్‌ కూడా చేయగలిగే శార్దూల్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయ్.

ఆరో బౌలర్ లేకపోవడం బుమ్రాపై ఒత్తిడిని పెంచుతోంది. ఐపీఎల్‌లో మెరిసినప్పటికీ బుమ్రా 50ఓవర్ల ఫార్మాట్‌లో సత్తా చాటలేకపోతున్నాడు. షమి కట్టుదిట్టంగా బంతులు వేస్తుండటం భారత్‌కు ఊరట. అతడితో పాటు బుమ్రా కూడా మెరిస్తే ఆస్ట్రేలియా‌ స్కోరును పరిమితం చేయొచ్చు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆసీస్ టాప్‌ఆర్డర్‌ ఫించ్‌, వార్నర్‌, స్మిత్‌ను కట్టడి చేయడంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉంటాయ్. ఇక అటు భారత్ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే మయాంక్ బాగానే ఆడుతున్నా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు. రెండో వన్డేలో పైచేయి సాధించాలంటే భారత ఆటగాళ్లు సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. ధావన్‌, హార్దిక్‌తో పాటు కేఎల్ రాహుల్ రాణించాలి. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ గొప్ప ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story